రైతు చనిపోతే PM Kisan డబ్బులు ఆగిపోతాయా..? వారసులు ఎలా పొందాలో తెలుసుకోండి!

-

వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న కుటుంబంలో రైతు హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో కూరుకుపోవడమే కాకుండా ఆర్థిక, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆయన పేరిట ఉన్న వ్యవసాయ భూమి, పీఎం కిసాన్ నిధులు, బ్యాంకు డిపాజిట్లు ఎవరికి చెందుతాయి? కేసీసీ (KCC) రుణాలు ఏమవుతాయి? అనే విషయాలపై చాలామందికి స్పష్టత ఉండదు. వీటికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, వారసులు అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భూమి వారసత్వ హక్కులు ఎవరికి దక్కుతాయి?: రైతు మరణానంతరం భూమి దానంతట అదే ఒకే కొడుకు లేదా భార్య పేరు మీదకు మారదు. ఇక వీలునామా ఉంటే దాని ప్రకారమే పంపిణీ జరుగుతుంది. ఒకవేళ వీలునామా రాయకపోతే, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మొదటి తరగతి వారసులైన భార్య, కుమారులు, కుమార్తెలు మరియు తల్లి అందరికీ ఆస్తిలో సమాన హక్కులు దక్కుతాయి.

పీఎం కిసాన్, పంట బీమా డబ్బులు ఎలా పొందాలి?: రైతు మరణించగానే పీఎం కిసాన్ నిధులు ఆటోమేటిక్‌గా కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రావు. వారసత్వంగా భూమి పొందిన కొత్త యజమాని అర్హత ప్రమాణాలు పూర్తిచేసి, వివరాలను నవీకరించి రికార్డులు మార్చుకోవాలి. అలాగే పంట నష్టం జరిగితే సంబంధిత ఆధారాలతో బ్యాంకు లేదా వ్యవసాయ శాఖను సంప్రదించి బీమా పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

PM-KISAN After Farmer’s Death: How Can Legal Heirs Receive the Benefits?
PM-KISAN After Farmer’s Death: How Can Legal Heirs Receive the Benefits?

బ్యాంకు ఖాతాలోని డబ్బులు, నామినీ హక్కులు: మరణించిన రైతు బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు చట్టబద్ధమైన ఆస్తి కిందకే వస్తుంది. ఇక ఖాతాకు నామినీ ఉంటే బ్యాంకు నుంచి డబ్బు సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే నామినీగా ఉన్నంత మాత్రాన మిగతా చట్టబద్ధమైన వారసుల హక్కులు రద్దు కావు. నామినీ కేవలం డిపాజిట్ సంరక్షకుడిగా మాత్రమే వ్యవహరిస్తారు.

కేసీసీ (KCC) రుణాలు రద్దవుతాయా?: రైతు మరణించగానే బ్యాంకు రుణాలు వాటంతట అవే రద్దు కావని గుర్తుంచుకోవాలి. ఆ రుణానికి బీమా ఉందా, ఇక ఏవైనా హామీలు ఉన్నాయా అనే విషయాలపై రుణ తదుపరి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను కలిసి రాతపూర్వక వివరాలు తీసుకోవడం మంచిది.

ఇక కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయినప్పుడు ఆందోళన చెందకుండా చట్టపరమైన ప్రక్రియలపై అవగాహన పెంచుకోవాలి. సరైన పత్రాలతో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకులను సంప్రదిస్తే హక్కులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సకాలంలో పొందవచ్చు.

గమనిక: భూమి మ్యుటేషన్ (పట్టా మార్పిడి), వారసత్వ ధృవీకరణ పత్రం మరియు పిఎం కిసాన్ లబ్ధిదారుల వివరాల మార్పు కోసం మీ పరిధిలోని తహసీల్దార్ లేదా మండల రెవెన్యూ అధికారి (MRO) లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించవలెను.

Read more RELATED
Recommended to you

Latest news