చెన్నయ్ వేదికగా సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతున్న డీలిమిటేషన్ వ్యతిరేక సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవన్నారు. గతంలో వాజ్పేయి లోక్సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు మోడీ కూడా అదే చేయాలన్నారు.డీలిమిటేషన్లో శాస్త్రీయమైన పద్ధతి అవలంభించాలని కోరారు.
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నిధుల్లో సరైన వాటా రావడం లేదని, ఆర్థిక అభివృద్ధి జీడీపీ, ఉద్యోగ కల్పనతో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయని తెలిపారు. దేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ.. మనకు తిరిగి వచ్చేది తక్కువ అని అన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే అని అన్నారు. అదే బిహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది 6 రూపాయలు అని విమర్శించారు. యూపీకి రూ. 2 మేర నిధులు వస్తున్నాయని తెలిపారు.