మొక్క‌లు నాటిన ప్రభాస్.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

-

“పుడమి పచ్చగుండాలే – మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన నివాసంలో 3 మొక్కలు నాటి 3వ దశ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా ఆయ‌న‌ దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం త‌న‌ను ఇన్ స్పైర్ చేసింద‌ని అందుకే ఆయ‌న‌ స్పూర్తితో ఆయ‌న‌ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నాన‌ని తెలిపారు. సంతోష్ కుమార్ మహోన్నతమైన ఆశయం ముందుకు సాగాలంటే.. మనమంతా ఆయ‌న‌ ఆలోచనల‌కు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంద‌ని, అప్పుడే సమాజం బాగుంటుందని, ఈ కార్యక్రమంలో త‌న‌ అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు.

అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. ఆయ‌న‌ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆశయం తెలుసుకున్న వెంటనే 3 మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయక‌మ‌న్నారు. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతులమీదగా ఈ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోష‌క‌ర‌మ‌న్నారు. కోట్లాదిగా ఉన్న ఆయ‌న‌ అభిమానులంతా ఒక్కొక్కరూ 3 మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరివేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సమన్వయకర్త సంజీవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version