పౌర్ణమి రోజు తప్పక పాటించాల్సిన సూచనలు..

-

తెలుగు మాసాల్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం ఎంతో పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో ఉన్నాం. ఈ క్రమంలోనే జూన్ 29న సోమవారం నాడు జ్యేష్ఠ పూర్ణిమ (పౌర్ణమి) వచ్చింది. జ్యేష్ఠ అంటేనే గొప్పదైన మాసం అని, ఇది జ్ఞానానికి, పరిపూర్ణతకు ప్రతీక అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున చేసే పూజలు, వ్రతాలు వెయ్యిరెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. మరి ఈ రోజున ఎలాంటి పూజలు చేయాలి, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు: ఈసారి పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం విశేషం. ఈ రోజున భక్తులు ఉదయాన్నే నదీస్నానాలు చేసి, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటే చాలా మంచిది. అలాగే శివుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి భోళాశంకరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించాలి. ఇక ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ, లలిత సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

Purnima 2026: Important Practices to Follow on the Full Moon Day
Purnima 2026: Important Practices to Follow on the Full Moon Day

ఈ దీపారాధనలు ఎంతో ముఖ్యం: జ్యేష్ఠ పూర్ణిమ రోజున సాయంత్రం పూట రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దీపం వెలిగించుకోవాలి. ఇక ఈ పర్వదినాన విష్ణుమూర్తి, శివుడు, లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే జాతకంలోని అన్ని రకాల దోషాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

దానధర్మాలు మరియు దుస్తులు: ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శని పీడలతో, ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ రోజున పండితులకు దానాలు ఇవ్వాలి. అలాగే పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు ఉండకూడదనుకునే వారు ‘కనకధారా స్తోత్రం’ చదువుకోవాలి.

పిల్లల అక్షరాభ్యాసానికి శుభ సమయం: ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మూల నక్షత్రం కూడా కలిసి వచ్చింది. మూల నక్షత్రం అనేది చదువుల తల్లి సరస్వతి దేవి జన్మ నక్షత్రం కాబట్టి, ఈ రోజు చాలా పుణ్యప్రదమైనది. అందుకే ఈ శుభదినాన తమ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలాగే సొంతింటి కల నెరవేరాలి అనుకునే వారు ఈ రోజున ‘మణికర్ణిక స్తోత్రం’ ‘మణి దీప వర్ణన’ పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.

జ్యేష్ఠ పూర్ణిమ అనేది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజున ఉదయం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఉపవాసాలు, పూజలు చేయడానికి చక్కటి సమయం దొరికినట్లయింది.

గమనిక: పూజలు, దానాలు మరియు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాల ఖచ్చితమైన ముహూర్తాల కోసం మీ స్థానిక పురోహితులను లేదా పంచాంగ పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news