ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత మారిన జీవనశైలి, ఒత్తిడి వల్ల చాలామంది యోగాను తమ దినచర్యగా మార్చుకున్నారు. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిన ఈ అద్భుత విద్య, నేడు ప్రపంచ దేశాలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. అసలు యోగా ఎక్కడ పుట్టింది, మన ప్రాచీన కాలం నుంచి అది ఎలా సాగుతూ వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదియోగి నుంచి మొదలైన ప్రయాణం: మన పురాణాల ప్రకారం యోగాకు తొలి గురువు సాక్షాత్తూ ఆ పరమశివుడే. ఆయనను ‘ఆదియోగి’ అని పిలుస్తారు. శివుడు ఈ యోగ విజ్ఞానాన్ని మొదటగా సప్తర్షులకు (ఏడుగురు మహర్షులకు) బోధించారని నమ్ముతారు. ఇక ఆ తర్వాత సింధూ నాగరికత తవ్వకాల్లో దొరికిన ‘పశుపతి ముద్ర’ ద్వారా ఆ కాలంలోనే యోగా ఉన్నట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి.
యుజ్ అంటే ఐక్యం చేయడం: యోగా అనే పదం ‘యుజ్’ అనే సంస్కృత మూల పదం నుండి వచ్చింది. దీని అర్థం ‘ఐక్యం చేయడం’ లేదా ‘కలపడం’. అంటే మన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయడమే యోగా. మన ప్రాచీన ఋగ్వేదంలో ఆ తర్వాత వచ్చిన ఉపనిషత్తులలో యోగా గురించి మొదటిసారిగా చెప్పారు. ఇక మనస్సును స్థిరంగా ఉంచడానికి, ఇంద్రియాలను అదుపులో పెట్టడానికి యోగా ఎలా పనిచేస్తుందో అందులో వివరించారు.

భగవద్గీత చూపిన జీవన విధానం: కాలక్రమేణా భగవద్గీత యోగాను ఒక సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో కేవలం ఆసనాలే కాకుండా కర్మ యోగం జ్ఞాన యోగం భక్తి యోగాల ద్వారా యోగాన్ని ఒక సంపూర్ణ జీవన విధానంగా మార్చారు. ఇక మనం చేసే పనిని ఎలా భక్తితో నిష్కామంగా చేయాలో భగవద్గీత మనకు నేర్పించింది.
పతంజలి మహర్షి అష్టాంగ యోగం: క్రీ.పూ. 400 ప్రాంతంలో పతంజలి మహర్షి అప్పటివరకు అక్కడక్కడా ఉన్న యోగ జ్ఞానాన్ని అంతా కలిపి ‘యోగ సూత్రం’గా క్రోడీకరించారు. ఇక ఆయన యోగాను కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా మనస్సును జయించే ఒక పెద్ద శాస్త్రంగా మార్చారు. అందుకోసమే ఆయన మనకు ‘అష్టాంగ యోగా’ అనే అద్భుతమైన భావనను అందించారు.
ఇక మారిన నేటి ఆధునిక కాలంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక దివ్యౌషధం లాంటిది. వేల ఏళ్ల క్రితం మన దేశం ప్రపంచానికి ఇచ్చిన ఈ గొప్ప వరప్రసాదాన్ని మనం కూడా రోజూ సాధన చేస్తూ, ఆరోగ్యకరమైన మరియు ఒత్తిడి లేని ఆనందమయ జీవితాన్ని గడుపుదాం.
