మా విజన్ స్వీకరించినందుకు సంతోషం : రాహుల్ గాంధీ

-

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కింపుతో పాటు కుల గణన చేపడతామని ప్రకటించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. “మేమే పార్లమెంట్‌లో కుల గణన అవసరం అని స్పష్టం చెప్పాం. అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని వాదించాం. గతంలో మోదీ కేవలం నాలుగు కులాల గురించి మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ, 11 ఏళ్ల తర్వాత కుల గణన ప్రకటన వచ్చింది” అని పేర్కొన్నారు.

ఇది కేవలం తొలి అడుగేనని, తెలంగాణ కుల గణన ఒక బ్లూ ప్రింట్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం కుల గణనకు తమ మద్దతు ఉందని, బీహార్‌ మాదిరిగానే తెలంగాణ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. కుల గణన ద్వారా రిజర్వేషన్ల పరిమితికి మించిన అభివృద్ధి మోడల్‌ను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఎంత మేరకు వాటాదారులై ఉన్నారో తెలుసుకోవడానికి కుల గణన కీలకమని అన్నారు.

ఇక ఉగ్రవాదంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ కోరారు. పెహల్గామ్ దాడికి పాల్పడిన దుండగులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. “ఉగ్రవాదంపై పోరాటానికి మా మద్దతు ఉంది. ప్రధాన మంత్రి స్పష్టమైన విధానం అనుసరించాలి. అరకొర చర్యలు కాకుండా ధైర్యంగా స్పందించాలి” అని అన్నారు. పెహల్గామ్ దాడిలో మృతులైన వారిని “అమరవీరులు”గా గుర్తించాలని కోరారు. బాధిత కుటుంబాల ఈ కోరికను తన ద్వారా తెలియజేయాలని వారు అభ్యర్థించారని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news