రిలయన్స్ గ్రూప్ మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ (FMCG) రంగంలో రిలయన్స్ రిటైల్ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా టెక్నాలజీని వాడుకుంటూ సరికొత్త విప్లవానికి తెరలేపింది. రాబోయే రోజుల్లో మనం తినే ఆహార పదార్థాల తయారీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
ఆసియాలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్ట్: రిలయన్స్ రిటైల్ రాబోయే మూడేళ్లలో ఆసియాలోనే అతిపెద్ద సమీకృత ఫుడ్ పార్కును ఏర్పాటు చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఇక ఈ పార్కుల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, నిత్యావసర వస్తువులు మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను భారీ స్థాయిలో తయారు చేస్తారు. ఇవన్నీ కేవలం మామూలు ఫ్యాక్టరీల్లా కాకుండా పూర్తిగా సరికొత్త టెక్నాలజీతో నడిచేలా డిజైన్ చేస్తున్నారు.

రూ.30,000 కోట్ల భారీ పెట్టుబడి: ఈ సరికొత్త ఏఐ ఆధారిత, రోబోటిక్ ఫుడ్ పార్కుల నెట్వర్క్ కోసం రిలయన్స్ ఏకంగా రూ.30,000 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సంస్థ డైరెక్టర్ ఈశా అంబానీ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ రంగంలో సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన రిలయన్స్, తాజా నిర్ణయంతో మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా తయారీ ఖర్చులు తగ్గి, వినియోగదారులకు తక్కువ ధరకే క్వాలిటీ వస్తువులు అందుతాయి.
రోబోలు, ఏఐతో నడిచే ప్రొడక్షన్: ఈ ఫుడ్ పార్కులలోని ప్రొడక్షన్ లైన్స్ అన్నీ ఏఐ (AI), రోబోల నియంత్రణలో పనిచేస్తాయి. అంటే వస్తువుల ప్యాకింగ్ క్వాలిటీ చెకింగ్, స్టాక్ మేనేజ్మెంట్ వంటి పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇక దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆహార పదార్థాల తయారీ సాధ్యమవుతుంది.
ఇక రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ ఎఫ్ఎమ్సీజీ రంగంలో సరికొత్త మార్పులకు దారితీయనుంది. ఇక అత్యాధునిక సాంకేతికతను వంట గది వస్తువుల తయారీకి ముడిపెడుతూ రిలయన్స్ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్తులో వినియోగదారులకు మరింత మేలు చేయనున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ మార్కెట్లోకి వస్తే వ్యాపార సరళి పూర్తిగా మారిపోవడం ఖాయం.
గమనిక: రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తన క్యాంపా (Campa), ఇండిపెండెన్స్ (Independence) వంటి బ్రాండ్లతో ఇప్పటికే మార్కెట్లో మంచి వృద్ధిని సాధించింది. ఈ కొత్త ఫుడ్ పార్కుల ద్వారా 2030 నాటికి రూ.1 లక్ష కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని అందుకోవాలని సంస్థ గట్టి పట్టుదలతో ఉంది.
