వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ

-

అశేష అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) బుధవారం వాంఖడే స్టేడియంలో లెజెండరీ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ వేడుక ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు జరిగింది. సచిన్ చివరి మ్యాచ్ ఆడిన ముంబైలోని ప్రఖ్యాత వాఖండే స్టేడియంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రేయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీసీసీఐ సెక్రెటరీ జే షా, బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. త్వరలో శ్రీలంక మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో సచిన్ విగ్రహావిష్కరణ జరగడం గమనార్హం. వాంఖడే స్టేడియంలో 2013 నవంబర్‌లో జరిగిన మ్యాచ్‌తో సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు పోటెత్తిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అర్ధ సెంచరీతో ఆ మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సచిన్ అభిమానుల నినాదాల నడుమ తన కెరీర్‌ను ముగించారు. సచిన్ రిటైర్ అయి పదేళ్ల కావస్తున్న ఆయన నెలకొల్పిన అనేక రికార్డులు ఇప్పటికీ ఎవరూ అధిగమించలేదు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version