Breaking : ఫైనల్‌లో పాకిస్తాన్‌ ఓడిన వేళ.. షోయబ్ అక్తర్ ట్వీట్‌.. షమీ కౌంటర్‌..

-

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. రెండవసారి టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడాలనుకున్న పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ ప్రపంచ కప్‌ను రెండోసారి  ఎగరేసుకు పోయింది. ఫలితంగా ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాల్లో మునిగిపోగా.. పాకిస్తాన్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. తృటిలో పొట్టి ప్రపంచ కప్ చేజారడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను తెలియపరుస్తున్నారు. పాక్ ఓటమిని జీర్ణించుకోలేక తమ ఫీలింగ్స్ షేర్ చేసిన వారి జాబితాలో పాక్ మాజీ క్రికట్ దిగ్గజం షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. ‘ముక్కలైన హృదయం’ ఎమోజీని ట్వీట్ చేసి తన నిరాశను తెలియజేశాడు. అయితే ఈ ట్విట్‌పై ఇండియన్ పేసర్, టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బౌలర్ మహ్మద్ షమీ వెంటనే స్పందించాడు. ‘‘ సారీ సోదరా.. దీన్నే కర్మ అంటారు’’ అని రాసుకొచ్చాడు.

ముక్కలైన హృదయం ఎమోజీలు మూడింటిని జోడించాడు. ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడినప్పుడు భారత జట్టుపై షోయబ్ అక్తర్ అతి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా షమీ దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చినట్టయ్యింది. కాగా సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన టీమిండియాపై షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత్ అర్హతలేదని, ఇండియా బౌలింగ్ ఎలాంటిదో తేటతెల్లమైందని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ అథమ స్థాయిలో ఉందని ఘాటైన పదజాలాన్ని ప్రయోగించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version