సాధారణ తలనొప్పి వస్తే ఒక కప్పు కాఫీ తాగితే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ అలా కాదు.. తలలో సుత్తులతో కొట్టినట్లు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నరకాన్ని భరించడం ఎవరికైనా కష్టమే. అయితే కంగారు పడకండి! మన రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ మైగ్రేన్ మహమ్మారిని దూరం పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?: మనం సమయానికి భోజనం చేయకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మైగ్రేన్ మొదలవుతుంది. ఎక్కువగా ఆందోళన చెందడం, ఎండలో తిరగడం, ఫోన్ ఎక్కువగా చూడటం కూడా ఈ నొప్పిని పెంచుతాయి. మన శరీరానికి సరిపడని పనులు చేసినప్పుడు అది తలనొప్పి రూపంలో హెచ్చరికలు జారీ చేస్తుంది.
భోజనానికి ఒక టైమ్ ఉండాలి: మీరు ఎప్పుడు పడితే అప్పుడు తినడం మానేయండి. ఉదయం 9 లోపు టిఫిన్, మధ్యాహ్నం 2 లోపు లంచ్, రాత్రి 8 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ఇక ఇలా క్రమశిక్షణగా తింటే సగం సమస్య తగ్గిపోతుంది. అలాగే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్గా ఉండి తలనొప్పి రాకుండా చూస్తుంది.

ఈ ఆహారాలు మీ తోడుగా..: మీ డైట్లో పనీర్, గుడ్లు, పప్పులు, పెరుగు వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. రోజూ కొన్ని గుమ్మడి గింజలు, తాజా పండ్లు తింటే చాలా మంచిది. ఇక జ్యూస్ల కంటే నేరుగా పండ్లు తినడానికే మొగ్గు చూపండి. నూనెలో వేయించిన ఫుడ్స్, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్కు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం.
నిద్రతోనే అసలు మందు: ఇక మంచి నిద్ర అన్నిటికంటే పెద్ద మందు. రాత్రిపూట కెఫీన్ (టీ, కాఫీ) ఎక్కువగా తీసుకోకండి, దీనివల్ల నిద్ర చెడి నొప్పి పెరుగుతుంది. ఇక ఒత్తిడి తగ్గించుకోవడానికి చిన్నపాటి వ్యాయామాలు, ధ్యానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే మైగ్రేన్ దానంతట అదే తగ్గిపోతుంది.
మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు, అది మన జీవనశైలి సరిగ్గా లేదని చెప్పే సంకేతం. క్రమబద్ధమైన ఆహారం, సరైన నిద్రను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఇక చూపు మందగించడం, జ్వరం మెడ పట్టేయడం వంటి లక్షణాలతో కూడిన తీవ్రమైన తలనొప్పి ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించడం మర్చిపోవద్దు.
