వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయట తిరగడమే కష్టమైపోతుంది. అలాంటిది నిర్మాణ కార్మికులు, రోడ్డు పనులు చేసేవారు, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారులు మండే ఎండల్లో గంటల తరబడి చెమటోడ్చాల్సి వస్తుంది. ఈ టైమ్లో కేవలం ఆకలి తీరడమే కాదు, ఒంట్లో నీటి శాతం తగ్గకుండా, అలసట రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ఖర్చుతో దొరికే కొన్ని ఆహారాలతో ఎండదెబ్బ తగలకుండా బాడీని కూల్గా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమృతం లాంటి పెరుగు, మజ్జిగ: ఎండలో పనిచేసే వారు మధ్యాహ్నం భోజనంలో పెరుగును అస్సలు మిస్ చేయకూడదు. ఇది కడుపుని చల్లబరచడమే కాకుండా, ఎండ వేడికి ఆకలి చచ్చిపోయినప్పుడు కూడా అన్నం సులభంగా అరిగేలా చేస్తుంది. అలాగే, పని మధ్యలో కాస్త గ్యాప్ దొరికినప్పుడు ప్యాకెట్ జ్యూస్ల జోలికి వెళ్లకుండా చక్కగా ఉప్పు, జీలకర్ర పొడి వేసిన మజ్జిగ తాగాలి. ఇది తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
తేలికపాటి ఆహారమే బెస్ట్ ఛాయిస్: వేసవిలో మసాలాలు దట్టించిన కూరలు, నూనె వస్తువులు తింటే కడుపులో మంటగా, భారంగా అనిపిస్తుంది. అందుకే మధ్యాహ్నం పూట పెరుగన్నం, పప్పన్నం లేదా వేడి తక్కువగా ఉండే కిచిడీ లాంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. ఇవి త్వరగా జీర్ణమై, ఎండలో పనిచేయడానికి అవసరమైన గ్లూకోజ్ను, శక్తిని శరీరానికి అందిస్తాయి.

పచ్చి ఉల్లిపాయ, దోసకాయల తోడు: మనం తినే లంచ్లో ముడి కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా దోసకాయలో నీటి శాతం ఎక్కువ కాబట్టి ఇది దాహాన్ని అదుపు చేస్తుంది.ఇక భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ, కాస్త నిమ్మరసం, టమాటా ముక్కలు నంచుకుని తింటే రుచికి రుచి.. శరీరానికి చల్లదనం లభిస్తాయి. ఉల్లిపాయలు ఎండదెబ్బ తగలకుండా చేయడంలో సూపర్ గా పనిచేస్తాయి.
మండే ఎండల్లో జీవనోపాధి కోసం కష్టపడే అన్నదాతలు, కార్మికులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. ఖరీదైన హెల్త్ డ్రింక్స్ అవసరం లేకుండా.. మన ఇంట్లో దొరికే మజ్జిగ, పెరుగు, ఉల్లిపాయలతోనే ఈ వేసవిని సులభంగా తట్టుకోవచ్చు. కష్టపడండి.. కానీ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి
గమనిక: ఎండలో పనిచేసేటప్పుడు తలకి గుడ్డ కట్టుకోవడం, వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ ఉంచుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ విపరీతమైన కళ్లు తిరగడం, వాంతులు కావడం లాంటివి అనిపిస్తే వెంటనే నీడకు చేరి, వైద్యుడిని సంప్రదించండి.
