చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇంట్లో పెద్ద పెద్ద మట్టి కుండల్లో బియ్యం, పప్పులు, నూనె దాచి ఉంచడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. బయట ఎంత ఎండలు మండిపోతున్నా, ఆ కుండల్లోని వస్తువులు నెలల తరబడి ఎంతో తాజాగా ఉండేవి. ఎలాంటి టెక్నాలజీ, ల్యాబ్లు లేని ఆ రోజుల్లోనే మన పూర్వీకులు ప్రకృతిని ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. వారి అద్భుతమైన తెలివితేటలకు నిదర్శనంగా నిలిచే ఒక గొప్ప విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
3500 ఏళ్ల క్రితమే భూగర్భ గుహలు: కోయంబత్తూరు సమీపంలోని మొలపాలయంలో, పశ్చిమ ఘాట్ల అడుగుభాగంలో ‘నియోలిథిక్’ యుగానికి చెందిన కొన్ని భూగర్భ గుహలు బయటపడ్డాయి. ఇవి సుమారు 3500 సంవత్సరాల క్రితం నాటివట! ఆ కాలంలో వ్యవసాయం, పశుపోషణ చేసే ప్రజలు వీటిని నిర్మించారని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఇవి కేవలం ధాన్యాన్ని దాచుకోవడానికే కాదు.. వంట చేసుకోవడానికి, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే సురక్షిత ఆశ్రయాలుగా కూడా ఉపయోగపడేవట.

ఏసీలు లేని కాలంలో సహజ చల్లదనం: బయట ఎండలు 40 డిగ్రీలు దాటినా ఈ గుహల్లోని ధాన్యం అస్సలు పాడయ్యేది కాదు. దీని వెనుక ఒక సింపుల్ సైన్స్ ఉంది. భూమి ఉపరితలం కంటే లోపలి భాగంలో ఉష్ణోగ్రత ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక ఈ సూత్రాన్ని కనిపెట్టిన మన పూర్వీకులు గుహల గోడలకు వరి పొట్టు, తవుడు, ట్యాంక్ స్లడ్జ్ మిశ్రమాన్ని అప్లై చేసి, పశువుల పేడతో పూసి, సున్నం చల్లేవారు. ఇది తేమను పీల్చుకుని కీటకాలు, ఎలుకల నుంచి ధాన్యానికి రక్షణ కల్పించేది. పైన రాళ్లు, చాపలు కప్పి గాలి ఆడేలా చేసేవారు.
మరుగున పడుతున్న మట్టి సంప్రదాయాలు: భారతీయ సంప్రదాయంలో ఇలాంటి నిల్వ పద్ధతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొన్నటి వరకు గ్రామాల్లో ‘కులుమై’, ‘కుధిర్’, ‘కొడంబే’ అనే మట్టి నిల్వ నిర్మాణాలను వాడేవారు. కానీ, ఈ రోజుల్లో ప్రతి చిన్న దానికి ఫ్రిజ్లు, ఖరీదైన కోల్డ్ స్టోరేజీలపై ఆధారపడుతున్నాం. అయినా సరే, సరైన నిల్వ సదుపాయాలు లేక ప్రతి ఏటా టన్నుల కొద్దీ ధాన్యం వృథా అవుతోంది. ప్రకృతితో ముడిపడిన మన పాత పద్ధతులను మర్చిపోవడం వల్లే ఇలా జరుగుతోందేమో కదా!
ఆధునిక కాలంలో మనకు ఎన్నో సౌకర్యాలు ఉండొచ్చు కానీ, 3500 ఏళ్ల క్రితమే ప్రకృతిని గౌరవిస్తూ మన పూర్వీకులు సాగించిన జీవన విధానం నిజంగా మనందరికీ ఆదర్శం. ఇప్పటికైనా పర్యావరణానికి హాని చేయని ఆనాటి సహజసిద్ధమైన పద్ధతుల గురించి తెలుసుకోవడం, వీలైనంత వరకు వాటిని పాటించడం ఎంతైనా అవసరం.
గమనిక: మన ఇంట్లో వాడే మట్టి కుండలు, పాత్రలు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. వాటి వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు, సైన్స్ దాగి ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్ల కంటే మట్టి పాత్రల్లో నిల్వ చేసే ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా, పోషకాలతో ఉంటాయి.
