రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమావేశం జరిగింది.
ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపుల పై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నారు. మరోవైపు నిరుద్యోగులకు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. రూ.6వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు మూడు లక్షల నుంచి 5 లక్షల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.