బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య యుతంగా పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందని దయాకర్ రావు మాట్లాడడం ఆయన అధికార దాహానికి నిదర్శనం. ఆదరించి అందలం ఎక్కించిన తల్లి లాంటి టీడీపీ పార్టీని మోసం చేసి కేవలం కులబంధువులు అని బీఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేశారు.
మోసం, కుట్రలు, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడంలో దయాకర్ రావు దిట్ట కాబట్టి ఆయన కదలికలపై మాకు అనుమానం ఉంది. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని కోరాం’ అని బండి సుధాకర్ గౌడ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజల అభిమానం చూరగోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తే ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే తగిన మూల్యం చెలించక తప్పదని హెచ్చరిస్తున్నాను.