హైదరాబాద్లో డీజిల్ వాహనాలను ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. హైదరాబాద్ నోవాటెల్ లో జరిగిన బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం చేస్తున్నామన్నారు. బిల్డర్స్ కు స్వర్గధామం హైదరాబాద్ అని తెలిపారు. హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాదులో డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తామని తెలిపారు. ప్రపంచ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు. మూసి పునర్జీవనానికి ముందుకు పోతాం.. ఆధునిక దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.