కడియం శ్రీహరిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారారని నిప్పులు చెరిగారు. జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కేసీఆర్ పాలన ఐఫోన్లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉందని… ఐఫోన్కు, చైనా ఫోన్కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని చురకలు అంటించారు. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు.
మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి…. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదు? అని నిలదీశారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని.. స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదు? అని ప్రశ్నించారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే అని.. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.