గ్రామపంచాయతీ పాలన పుస్తకాన్ని రైల్వే రిటైర్డ్ అధికారి కె.వి. రావు (K.V. Rao) రచించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భారతదేశంలో పంచాయతీరాజ్ చరిత్ర మొదలుకొని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సభలు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, అర్హతలు, సర్పంచ్, సెక్రెటరీ నిధులు విధులు, గ్రామపంచాయతీ లో పన్నులు నిధుల వినియోగం, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్, గ్రామ ప్రగతి ప్రణాళికలు.. ఇలా సమగ్ర విషయాలను క్రోడీకరించి పుస్తకాన్ని రూపొందించిన రచయిత కె.వి.రావును ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందించారు.
గ్రామపంచాయతీ పాలనపై అవగాహన పెంచుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహద పడుతుందన్నారు. భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ, స్థానిక ఎన్నికలకి తెలంగాణ రాష్ట్రం సమాయత్తమవుతున్న సమయంలో ఇలాంటి పుస్తకం రావడం ఎంతో ఉపయోగకరమని మంత్రి సీతక్క తెలిపారు.