సినీ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చికిత్స కోసం ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలని తన కుటుంబ సభ్యులు చాలా రోజుల నుంచి వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చికిత్స కోసం అవసరమయ్యే హాస్పిటల్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. గత కొంత కాలం నుంచి బోడుప్పల్ ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఫిష్ వెంకట్ ను మంత్రి శ్రీహరి పరామర్శించారు.

ఆయన కుటుంబానికి రూ. లక్ష సహాయం అందించారు. ఫిష్ వెంకట్ వైద్య చికిత్స పూర్తి అయ్యేంత వరకు అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీహరి. ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే అతడిని తప్పకుండా బతికించాలని వైద్యులను రిక్వెస్ట్ చేశారు. దీంతో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.