Telangana : రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దీపావళి సంబురాల్లో మునిగిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి చాటి చెప్పేలా స్థానిక ఉత్పత్తులతోనే దీపావళి పండుగ జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లను పారద్రోలి కొత్త కాంతులు విరజిమ్మేలా ఆనందం, సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో స్వదేశీ తయారీదారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని తమిళిసై పిలుపునిచ్చారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతమే దీపావళి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని సీఎం వేడుకున్నారు. తెలంగాణ మాదిరిగా దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని.. సుఖ శాంతులు, సిరి సంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

బాణాసంచా వెలిగించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు వహించాలని గవర్నర్, సీఎం కోరారు. భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version