ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్ లో 12, 13 తేదీలలో అమెరికా ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పారిస్ లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 10న మోడీ ఫ్రాన్స్ కి బయలుదేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు.
కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంట్ రియాక్టర్ ను ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించనున్నారని తెలిపారు మిస్రీ. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్నారు. 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తరువాత తొలిసారి భేటీ కాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ట్రంప్ తో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్ లు విధిస్తున్న తరుణంలో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం విశేషం.