నీ కొడుకు పనికిరాడు..! ఇన్స్పిరేషనల్‌ స్టోరీ “థామస్‌ అల్వా ఎడిసన్‌”

-

ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్‌ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్‌ నీకిమ్మంది మా టీచర్‌..’ అని చెప్పాడు. కవర్‌ చింపి ఆ ఉత్తరం చదివిన ఆ తల్లి కళ్ల నిండా నీళ్లు… కొడుకు వినడం కోసం దాన్ని మరోసారి బయటకు చదివింది.

థామస్‌ అల్వా ఎడిసన్‌… ఆమెరికాకు చెందిన గొప్ప ఆవిష్కర్త, పెద్ద వ్యాపారవేత్త. అతని ఆవిష్కరణలు ఎంతో సంచలనం సృష్టించాయి.నైట్‌ లైట్లు, గ్రామఫోన్‌, సినిమా ప్రొజెక్టర్‌.. విప్లవం సృష్టించిన విద్యుత్‌ బల్బు. నిజంగా అతనో అద్భుత మేధావి. అతని ఆవిష్కరణల్లో కొన్ని ఉన్నవాటినే ఇంకా అభివృద్ధి పరచడమైతే, కొన్ని ఉద్దేశపూర్వకంగా కనుగొన్నవి. బల్బు, ప్రొజెక్టర్‌ ఆ కోవకు చెందినవే.

అమ్మకు ఉత్తరం

ఒకరోజు, పాఠశాల నుండి ఇంటికి వచ్చిన ఎడిసన్‌, వాళ్లమ్మకు ఓ లెటర్‌ ఇచ్చి, మా టీచర్‌ నీకిమ్మంది అని చెప్పాడు. ఆ తల్లి ఎంతో ఆత్రుతగా ఆ ఉత్తరం చదివింది. పూర్తవగానే అమ్మ కళ్లల్లో నీళ్లు. ఏముందమ్మా అందులో అన్న కొడుకు ప్రశ్నకు సమాధానంగా దాన్ని గట్టిగా చదివి వినిపించింది. ‘‘ మీ అబ్బాయి ఒక మేధావి. తనకు ఈ స్కూల్‌ సరైంది కాదు. ఇక్కడ సమర్థులైన ఉపాధ్యాయులు కూడా లేరు. కాబట్టి ఇకనుంచి మీరే మీ అబ్బాయికి చదువు చెప్పండి’’. నిజానికి అప్పటికి మూడు నెలలే అయింది థామస్‌ బడికి వెళ్లడం ప్రారంభించి. ఆనాటి నుండి అతనికి తల్లే గురువయింది. ప్రపంచమంతా గర్వపడే మేధావిని తయారుచేసింది. గణిత, భౌతిక శాస్త్రాల్లో ఉద్ధండుడయ్యాడు.

కొన్ని సంవత్సరాలకు వాళ్లమ్మ చనిపోయింది. థామస్‌ అల్వా ఎడిసన్‌ ఆ శతాబ్దంలోనే గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు. తన పేరు మీద దేశవిదేశాల్లో వేలాది పేటెంట్లు నమోదయ్యాయి. ఎన్నో ప్రయోగశాలలు, పరిశ్రమలు స్థాపించాడు. ఆసక్తిగల సమకాలీన పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేసాడు. ఎన్నో రకాల ఉపకరణాలు, యంత్రాలు తయారుచేసాడు. ఒకనాడు దేనికోసమో తన ఇంట్లో ఉన్న పాత బీరువాను వెతుకుతుండగా, ఒక ఉత్తరం కంటబడింది. అది చిన్నప్పుడు తన టీచర్‌ అమ్మకు రాసింది. ఆ ఉత్తరం చదివిన థామస్‌ కదిలిపోయాడు. అందులో ఇలా ఉంది…

‘‘థామస్‌ అల్వా ఎడిసన్‌ అనబడే మీ అబ్బాయి, మానసిక వికలాంగుడు. ఈ స్కూల్‌ అతడిని ఇక ఎంతమాత్రం భరించలేదు. కాబట్టి అతడిని బహిష్కరించడం జరిగింది’’.

ఎంతో ఉద్వేగంతో, కళ్లనిండా నీళ్లతో ఎడిసన్‌, తన డైరీలో ఇలా రాసుకున్నాడు..‘‘ థామస్‌ ఎ. ఎడిసన్‌ ఒక మానసిక వికలాంగుడైన అబ్బాయి. అతడిని వాళ్లమ్మ ఈ శతాబ్దానికే మేధావిగా మార్చింది’’.
అంటే, ఒక ప్రోత్సాహవు మాట, ఒకరి విధిని మార్చడంలో సహాయపడుతుంది. ఆ తల్లి చెప్పిన అబద్ధాన్ని నిజమని నమ్మిన ఎడిసన్‌, తన బలహీనతలను తెలియకుండానే అధిగమించాడు. ఆలోచనలనే ఆలంబనగా చేసుకున్నాడు. శోధించాడు. సాధించాడు.

1914 డిసెంబర్‌లో, తన ఫ్యాక్టరీలో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. మంటలు మొత్తం ఉన్న పది భవనాలను అలుముకున్నాయి. థామస్‌ అల్వా ఎడిసన్‌ ఆ మంటలను అదుపు చేయడానికి ఎంతో కృషి చేసాడు. ఫైరింజన్లు కూడా వచ్చాయి. కానీ, రసాయనాల కేంద్రం కావడంవలన మంటలను అదుపు చేయలేకపోయారు. తనిక ఏమీ చేయలేనని అర్థం చేసుకున్న ఎడిసన్‌, స్తబ్దుగా మంటలను చూస్తూ నిలబడ్డాడు. తన జీవితకాలపు శ్రమ కళ్లముందే బూడిదపాలు కావడం చూస్తున్నాడు.

ఇంతలో తన 24ఏళ్ల కుమారుడు చార్లెస్‌ కూడా వచ్చి తండ్రి పక్కన నిలబడి చూస్తున్నాడు. కొడుకుతో ఎడిసన్‌, ‘చార్లీ, వెళ్లి మీ అమ్మను, స్నేహితులను పిలుచుకు రా.. ఇంత గొప్ప అగ్నికీలలను వారు తమ జీవితంలో చూసుండరు’ అన్నాడు. దాంతో షాక్‌ తిన్న చార్లెస్‌, ‘నాన్నా.. మన ఫ్యాక్టరీ మొత్తం బూడిదయింది’ అనగా, థామస్‌, ‘అవును.. మన ఫ్యాక్టరీ మొత్తం బూడిదగా మారింది. దాంతో పాటు ఇప్పటివరకు అందులో మనం చేసిన తప్పులు కూడా భస్మమయ్యాయి. రేపటినుంచీ మనం మళ్లీ మొదటినుంచి మొదలుపెడదాం’ అన్నాడు.

తెల్లవారి తనను కలిసిన న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతినిధితోనూ ఇవే మాటలన్నాడు ఎడిసన్‌. ‘‘నిజానికి నాకిప్పుడు 67ఏళ్లు. అయినప్పటికీ, మంటలను అదుపు చేయడానికి అటూఇటూ పరుగెత్తాను. చేయగలిగినంతా చేసాను. రేపు నేను మళ్లీ మొదటినుండీ ప్రారంభిస్తాను’’ అన్నాడు. అన్నట్టుగానే థామస్‌, కొడుకు చార్లెస్ బూడిదవగా మిగిలిన ఫ్యాక్టరీని పునరుద్ధరించే పనిలో పడ్డారు. సాధించారు.

ఉపసంహారం

సాధారణంగా మనిషి జీవితంలో జరిగే విషాదాలు ఇవి. మన కలలు భగ్నమవుతాయి. మన ఆశలు గల్లంతవుతాయి. పడ్డ కష్టం వృధా అవుతుంది. కానీ, గొప్పవాళ్లెప్పుడూ దుఃఖపడరు. వారు తిరిగి తమ కలల సౌధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తారు. విజయులు దేన్నీ మధ్యలో వదిలేయరు. జీవితం విసిరిన పందేలను గెలవడానికి కష్టపడతారు. వారు కష్టాలలోనుండి ప్రయాణించరు. కష్టాలవల్ల ఎదుగుతారు. ఎన్నిసార్లయినా మొదటినుంచి ప్రారంభించడానికి గొప్ప పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తారు. అదే వారిని విజయతీరాలకు చేరుస్తుంది.

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news