టీఆర్‌ఎస్‌ కార్యకర్త అత్యుత్సాహం.. తప్పిన పెను ప్రమాదం

-

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు ఘనంగా చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నాయకులు బాణసంచాలు పేల్చుతూ.. మిఠాయిలు పంచుకున్నారు. అయితే.. ఈ వేడుకల్లో ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రమాదాన్ని సృష్టించింది. హైదరాబాద్‌ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్త తలపై బాణాసంచా షాట్స్‌ పెట్టుకుని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అటూ ఇటూ ఊగుతూ నడుస్తుండడంతో తలపై ఉన్న షాట్స్‌ రకరకాల దిశలకు వెళ్లి పేలాయి.

ఒక షాట్‌ జాతీయ రహదారి పక్కనే ఉన్న తాటిచెట్టుపై పడడంతో మంటలు చెలరేగాయి. తాటికమ్మలు పడడంతో కిందున్న చాట్‌ బండార్‌ బండి దగ్ధమైంది. నిర్వాహకుడు వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది. తాటిచెట్టు కిందనే విద్యుత్‌ లైన్‌ ఉండడంతో సరఫరాలో అంతరాయం కలిగింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలను టీఆర్‌ఎస్‌ నేతలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version