సీఎం కేసీఆర్‌ ఎక్కడ ? ప్రజల ముందుకు రండి..!

-

టెస్టుల సంఖ్య తక్కువ.. కేసుల సంఖ్య ఎక్కువ.. తక్కువ కేసులు నమోదవుతున్న బెంగళూరులో 33 గంటల లాక్‌డౌన్‌.. హైదరాబాద్‌లో డివిజన్‌ వైజ్‌గా కరోనా డేటా ఉంది.. అయినా ఏం వ్యూహం అమలు చేస్తున్నారు ? హైదరాబాద్‌ ఎటు వెళ్తోంది ? సీఎం మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పరెందుకు ? — ఓ ట్విట్టర్‌ యూజర్‌ ట్వీట్‌…

సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నారు ? హైదరాబాద్‌లో ఇంత జరుగుతోంది ? ఏం చేస్తారు ? — మరో యూజర్‌ ప్రశ్న…

కేవలం ఒకే వారంలో 50వేల టెస్టులు చేస్తామని చెప్పి 18 రోజుల సమయం తీసుకుకున్నందుకు కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. 50వేల టెస్టుల్లో 30 శాతం పాజిటివ్‌ కేసులు.. అది చాలా చిన్న విషయం.. — మరో యూజర్‌ పోస్టు…

కోవిడ్‌ నిబంధనలను పాటించకండి.. సోషల్‌ డిస్టాన్స్‌ను మరిచిపోండి.. పాజిటివ్‌ వస్తే ప్రైవేటు హాస్పిటల్స్‌లో చికిత్స తీసుకోండి.. ప్రజలకు మాత్రం తులసి నీళ్లు, వేడి నీళ్లు తాగామని కథలు చెప్పండి.. — ఇంకో యూజర్‌ అసహనం…

పైన చెప్పినవన్నీ.. మేం ఊహించుకుని చెబుతున్నవి కావు.. ట్విట్టర్‌లో యూజర్లు పెడుతున్న కామెంట్లు. అవి ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్విట్టర్‌లో ప్రస్తుతం #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. అందులో తెలంగాణ ప్రభుత్వంపై పలువురు నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో.. అందులోనూ హైదరాబాద్‌ పరిధిలో కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడున్నారు ? హైదరాబాద్‌లో కరోనా ఇంత దారుణంగా ఉంటే మీరు బయటకు రావడం లేదు ఎందుకు ? ప్రజల ముందుకు వచ్చి ధైర్యం చెప్పండి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ ఇంకా ఎంత దూరం వెళ్తుందో.. అసలు సీఎం కేసీఆర్‌ ప్రజల ముందుకు వస్తారో, రారో, కరోనాపై ఆయన ప్రెస్‌ మీట్‌ పెడతారో, లేదో వేచి చూస్తే తెలుస్తుంది. నిజానికి ఆయన ఈ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించి చాలా రోజులవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ పెట్టిన కొత్తల్లో వారానికి ఒకసారైనా ఆయన టీవీల్లో ప్రత్యక్షమై ప్రజలకు నేనున్నాంటూ ధైర్యం చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆయన సమావేశాల్లో కనిపించకపోవడం, మరోవైపు రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. ఆయన మరోసారి ప్రజల ముందుకు వస్తేనే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version