ఫ్రిజ్ నీళ్లకు అలవాటు పడి మనం మన ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నాం. కానీ, మన తాతల కాలం నాటి మట్టి కుండ నీరు తాగితే వచ్చే ఆ మజానే వేరు! కుండలో నీళ్లు కేవలం చల్లగా ఉండటమే కాదు, మన శరీరానికి ఎంతో మేలు చేసే ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయి. అసలు రోజూ కుండ నీళ్లు తాగడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుంటే, మీరు కూడా ఫ్రిజ్ను పక్కన పెట్టేస్తారు..
సహజ సిద్ధమైన చలువ: ఫ్రిజ్ నీళ్లు తాగితే ఒక్కోసారి గొంతు నొప్పి రావచ్చు, కానీ కుండ నీళ్లు చాలా సున్నితంగా శరీరానికి చలువ చేస్తాయి. మట్టి కుండలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి ప్రసరించి, నీరు సహజంగానే చల్లబడుతుంది. ఇక ఈ నీరు తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా, శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది.
యాసిడ్ సమస్యలకు చెక్: మట్టికి సహజంగానే ‘ఆల్కలైన్’ (Alkaline) స్వభావం ఉంటుంది. మన శరీరంలో ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు, కుండలోని ఆల్కలైన్ నీరు ఆ యాసిడ్లను తగ్గిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి మట్టి కుండ నీరు ఒక గొప్ప వరం అని చెప్పాలి.

మెటబాలిజం మెరుగుపడుతుంది: ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులోని రసాయనాలు నీటిలో కలుస్తాయి. కానీ మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇక అలాగే ఇందులోని మినరల్స్ నీటి నాణ్యతను పెంచి మనకు శక్తిని అందిస్తాయి.
గొంతు ఆరోగ్యానికి మేలు: తరచూ జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ఫ్రిజ్ నీళ్లకు బదులుగా కుండ నీళ్లను వాడటం ఉత్తమం. ఫ్రిజ్ నీళ్లు గొంతులోని కండరాలను బిగుసుకుపోయేలా చేస్తాయి, కానీ కుండ నీళ్లు శ్వాసనాళాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు. అందుకే గాయకులు, ఆస్తమా ఉన్నవారు కూడా హాయిగా ఈ నీటిని తాగవచ్చు.
