శ్రీమహావిష్ణువుకు ఉన్న వేల నామాల్లో ‘పుండరీకాక్షుడు’ అనేది అత్యంత శక్తివంతమైనది. స్నానం చేయలేని అత్యవసర పరిస్థితుల్లో ఈ నామాన్ని తలుచుకుని తలపై నీళ్లు జల్లుకుంటే స్నానం చేసినంత పవిత్రత వస్తుందని వేదాలు చెబుతున్నాయి. కేవలం బాహ్య శుచే కాకుండా అంతరంగ శుద్ధి కూడా జరుగుతుంది. మరి ఈ నామం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం, పురాణ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నామం వెనుక దాగి ఉన్న అసలు అర్థం: ‘పుండరీకం’ అంటే తామర పువ్వు, ‘అక్షుడు’ అంటే కన్నులు ఉన్నవాడు అని అర్థం. అంటే తామర రేకుల వంటి విశాలమైన, సుందరమైన నేత్రాలు కలిగిన శ్రీమహావిష్ణువు అని భావం. అలాగే సూర్యుడిని తన నేత్రంగా కలిగిన పరమ ప్రకాశవంతమైన చైతన్య స్వరూపమే ఈ పుండరీకాక్షుడు.

శివపూజలో విష్ణుమూర్తి నేత్ర సమర్పణ: ఒకానొక సమయంలో శ్రీమహావిష్ణువు 1008 పద్మాలతో పరమశివుడిని పూజిస్తుండగా, శివుడు విష్ణువు భక్తిని పరీక్షించడానికి ఒక పువ్వును మాయం చేశాడు. పూజ చివరలో ఒక పువ్వు తక్కువ కావడంతో, విష్ణుమూర్తి ఏమాత్రం సంకోచించకుండా తన కంటినే పీకి శివునికి సమర్పించాడు. ఇక ఈ త్యాగానికి మెచ్చిన శివుడు స్వామికి సుదర్శన చక్రాన్ని ఇచ్చి ‘పుండరీకాక్షుడు’ అనే నామాన్ని ప్రసాదించాడు.
పుండరీక మహర్షి క్షేత్ర పురాణం: తమిళనాడులోని తిరువెల్లారై దివ్యదేశంలో పుండరీకుడు అనే భక్తుడు రోజూ స్వామికి తామరపువ్వులతో పూజ చేసేవాడు. ఇక ఆయన నిష్కల్మష భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు తామరరేకుల వంటి కన్నులతో దివ్య దర్శనమిచ్చాడు. అందుకే అక్కడ స్వామివారికి ‘పుండరీకాక్ష పెరుమాళ్’ అనే పేరు స్థిరపడింది.
ఇక పుండరీకాక్షుడి నామాన్ని స్మరించడం అంటే సాక్షాత్ పరమాత్మ దివ్య చైతన్యాన్ని మనసులో నింపుకోవడమే. ఈ నామ స్మరణతో మనుషుల్లోని అజ్ఞానం తొలగి, మనస్సు అత్యంత పరిశుద్ధంగా మారుతుంది.
గమనిక: నామస్మరణతో పవిత్రత వస్తుందని చెప్పినంత మాత్రాన రోజూ స్నానం మానెయ్యకూడదు. ఇది కేవలం అనారోగ్యం లేదా ప్రయాణాల్లో స్నానం చేయలేని అత్యవసర పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.
