ఏకగ్రీవాలను అడ్డుకుంటున్న వైసీపీ కేడర్..కారణం ఇదే

-

ఏపీ పంచాయతీ ఎన్నికల సమరంలోకి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన అధికార వైసీపీ ఏకగ్రీవాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే చాల చోట్ల వైసీపీ కేడరే ఏకగ్రీవాలు కాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారట..విషయం ఎమిటా అని వాకబు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు అసలు విషయం తెలిసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట..

ఏకగ్రీవాల కోసం అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నానా తిప్పలు పడుతుంటే సొంత పార్టీ నేతలే వారికి చుక్కలు చూపిస్తున్నారు. పోలింగ్‌ జరగకుండా ఏకగ్రీవం అయితే..తమకు ఎలాంటి లాభం ఉండదని ద్వితీయ, క్షేత్రస్థాయి వైసీపీ నేతలు ఆందోళనతో ఉన్నారట. ఎన్నికలంటేనే గ్రామస్థాయిలో కనీసం పది లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ మొదలుకొని రోజువారీ ఖర్చులు.. మద్యం పంపిణీ.. ప్రచార ఖర్చులు ఒకటేమిటి ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాటిల్లో కొంత మేరకైనా వెనకేసుకోవచ్చన్నది చాలా మంది ఆలోచనగా ఉందట.

కొన్ని చోట్ల వైసీపీ నేతలే తెర వెనక ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బరిలో ఉండాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారట. కొందరు లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుంటుంటే.. ఇంకొందరు మాటలతో రెచ్చగొడుతున్నారట. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ తరహా వ్యవహారాలు సాగుతున్నట్టు అధికార పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అధికార పార్టీ నేతలు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారట.

ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇస్తూనే..సొంత పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు బుజ్జగించేందుకు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నారట వైసీపీ నేతలు. ఏకగ్రీవాలు అయితే ఖర్చులు తగ్గుతాయని స్థానిక కేడర్ కు కూడా ఏదో ఓ లబ్ది జరిగేలా చూస్తామని హామీలు ఇస్తున్నారట. విజయనగరం జిల్లా వైసీపీ నేతలకు మరో కష్టం వచ్చిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. దీంతో గ్రామస్థాయిలో చాలా మంది పంచాయతీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారట. పోటీ చేసేందుకు ముగ్గురు, నలుగురు వైసీపీ నేతలే పోటీ పడుతుండటంతో.. వారిని బుజ్జగించటం ఎమ్మెల్యేలు, మంత్రుల వల్ల కావడం లేదట.

ఒకవైపు పార్టీ అధిష్ఠానం నుంచి ఏకగ్రీవాలపై ఒత్తిడి.. ఇటు చూస్తే కేడర్‌ మాట వినకపోవడంతో ముందు నుయ్యి వెనక గొయ్యిలా తమ పరిస్థితి మారిందని టెన్షన్ పడుతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. శాసనసభ్యుడిగా గెలవడం కంటే.. పంచాయతీలలో పార్టీ కేడర్‌ పోరు తీర్చడం చాలా కష్టమని తలపట్టుకుంటున్నారట. ఇదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version