బెజవాడ మేయర్‌ పీఠం కోసం వైసీపీలో మొదలైన వార్

-

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బెజవాడ కార్పోరేషన్ లో సిగపట్ల రాజకీయం ఓ రేంజ్‌లో ఉంది. నిన్నటి వరకు మేయర్ పీఠం పై టీడీపీలో వార్ నడిస్తే ఇప్పుడు వంతు అధికారపక్షానిది. నేనే మేయర్.. నాదే పీఠం అంటూ కొందరు వైసీపీ నేతలు ప్రచారం సోషల్ మీడియా వేదికగా హీట్ పుట్టిస్తుంది. ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందని భావించింది ఏమో..వైసీపీ అధిష్టానం కూడా ఆ నేతలను పిలిచి గట్టి వార్నింగే ఇచ్చిందట..

విజయవాడ మేయర్‌ పీఠం నీదా నాదా అన్నట్టు కాచుకుని కూర్చుని ఉన్నాయి వైసీపీ, టీడీపీ. గత ఎన్నికల్లో మేయర్‌ కుర్చీ తెలుగుదేశానిదే. ఈసారి దాన్ని నిలబెట్టుకోవాలన్నది తమ్ముళ్ల ప్లాన్‌. కీలకమైన విజయవాడ మేయర్‌ పీఠం చేజారితే కష్టమని భావిస్తోంది అధికార వైసీపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ దిశగా పట్టుదలగానే ఉన్నారట. పార్టీల వ్యూహాలు.. ప్రతివ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉన్నా… వైసీపీలో కొత్త రగడ మొదలైంది. ఎన్నికలు జరగకుండానే నేనే మేయర్‌.. నాదే పీఠం అని మాటల తూటాలు పేల్చుతున్నారు మహిళా నేతలు.

బెజవాడ మేయర్‌ కుర్చీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో పోటీ కూడా పెరిగింది. విజయవాడ మున్సిపాలిటీపై వైసీపీ జెండా రెపరెపలాడించి.. సీఎం జగన్‌ దగ్గర మార్కులు కొట్టేయాలని మంత్రి, ఎమ్మెల్యేలు చూస్తుంటే.. వారి అనుచరుల తీరు టెన్షన్‌ పెట్టిస్తోందట. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు బెజవాడ ద్విత్వీయ శ్రేణి నాయకుల తీరు, విమర్శలు వైసీపీ పెద్దల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్‌ అయినట్టు సమాచారం. నేనే మేయర్‌.. నాదే పీఠం అని ఎవరైతే ప్రచారం చేసుకుంటున్నారో వారిని పిలిచి అక్షింతలు వేసినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీకి దిగుతున్న ఓ మహిళా నేత నేనే మేయర్‌ని అని చెప్పుకొంటున్న పలు వీడియో క్లిప్పింగులు వైసీపీ అధిష్ఠానం దగ్గరకు వెళ్లాయట. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌..ఆ మహిళా నేతను పిలిచి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్టు చెబుతున్నారు. మరో మహిళా అభ్యర్థి అయితే అత్యుత్సాహం ప్రదర్శించి నేనే మేయర్‌గా ఉంటాను.. అంతగా కావాలంటే కొందరు కార్పొరేటర్‌ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేసి గెలిపించుకుంటానని ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ విషయం తెలియడంతో.. ఆమెను పిలిచి అలాంటి ట్రయిల్స్‌ మానుకోవాలని హెచ్చరించి పంపారట.

సీఎం జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న తమకే మేయర్ సీటు వస్తుందని ప్రచారం చేస్తోన్న సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ అభ్యర్థికి కూడా పార్టీ పెద్దల నుంచి అక్షింతలు పడ్డాయట. మేయర్ ఎవరు ఏ నియోజకవర్గం నుంచి.. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తామన్నది ఎన్నికల తర్వాత సీఎం జగన్ ప్రకటిస్తారట. అప్పటి వరకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నది నేతల తేల్చి చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news