నేడు కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. రెండో జాబితాపైనా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రచారంపై ఫోకస్ పెట్టింది. విజయభేరి యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రచార రంగంలో దూసుకెళ్తోంది. రెండ్రోజులుగా రాహుల్ గాంధీ ప్రసంగాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఓవైపు ప్రచారంలో దూసుకెళ్తూనే.. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాపై ఫోకస్ పెట్టింది. రెండో జాబితా విడుదల తర్వాత ఉత్పన్నమైన పరిణామాల దృష్ట్యా మూడో జాబితాపై జాగ్రత్తగా కసరత్తు చేస్తోంది.  మొదటి జాబితా 55 మంది .. రెండో జాబితా 45మంది పేర్లతో విడుదల చేసిన తర్వాత పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. కొంత మంది కీలక నేతలు పార్టీని వీడారు కూడా. ఈ నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించడం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే మూడో జాబితాను జాగ్రత్తగా రూపొందిస్తోంది. 19 నియోజకవర్గాల్లో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తోంది.

శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు వామపక్షాలకు  కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా కాంగ్రెస్ అంగీకరించిందని.. కానీ సీపీఎం మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇవాళ ఏ సమయంలో అయినా మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news