హైదరాబాద్లోని సరూర్ నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గడువు తీరిన షాపుల లీజుదారులను అధికారులు దగ్గరుండి ఖాళీ చేయిస్తున్నారు. అయితే, ఖాళీ చేసేందుకు వ్యాపారులు అంగీకరించలేదు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేసు కోర్టులో ఉందని దుకాణాదారులు చెబుతున్నారు.
అయితే, లీజుకు ఇచ్చిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు.అందుకే షాపు లీజుదారులకు ఖాళీ చేయిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, కేసు కోర్టులో ఉండగా ఎలా ఖాళీ చేయిస్తారని వ్యాపారులు ప్రశ్నిస్తే.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించారు.