కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదిక కానుంది. గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యగ్రహంలో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా ఏప్రిల్ 08, 09 తేదీలలో ఇక్కడ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఏప్రిల్ 08న సీడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 09న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ రెండు సమావేశాలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన వహిస్తారన్నారు. ఈ కీలక భేటీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలను ఒక చోటుకు చేర్చడమే కాకుండా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఎదురయ్యే సవాళ్లు, రాజ్యాంగం, దాని విలువలపై నిరంతరం జరుగుతున్న దాడిపై చర్చించి భవిష్యత్ కార్యచరణను రూపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ కార్యాలయం బేరర్లు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు.