గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పెను దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసు నమోదు కాగా.. మరికొందరు సినీ తారలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యాప్ లను, వాటి ప్రమోషన్లను అరికట్టాలని కోరుతూ యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. పేరుమోసిన సినీ తారలు ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల యువత వాటి బారిన పడి మోసపోతోందంటూ ఈ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కోరాడు.
దీనిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. బెట్టింగ్ యాప్లు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని వీటికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అన్నారు. బెట్టింగ్ యాప్ల మోజులో పడి ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని.. వీటి బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ఆయా యాప్లపై చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారం అని తెలిపారు. ఇందుకోసం బెట్టింగ్ నిరోధక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.