శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త టోల్ విధానం అమల్లోకి రానుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై కేంద్ర సర్కార్ స్పష్టతనిచ్చింది. మే 1 నుంచి దీన్ని అమలు చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఫీజు వసూలుకు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) విధానాన్ని తొలుత ఎంపిక చేసిన టోల్ప్లాజాల వద్ద అమరుస్తారని ఈ ప్రకటనలో పేర్కొంది. ఏఎన్పీఆర్, ఫాస్టాగ్ కలగలిపి సేవలందించడంతో.. ఏఎన్పీఆర్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్లను గుర్తిస్తే.. వాహనాలు ఆగకుండానే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేయొచ్చని వెల్లడించింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆ శాఖ తన ప్రకటనలో వివరించింది.