కరోనా.. కర్కటి రాక్షసి కథ – బ్రహ్మ చెప్పిన విషూచిక మంత్రం..!

-

కరోనా యుగాల క్రితమే వచ్చింది . కర్కటి అని ఓ మహారాక్షసి. దానిది అంతులేని ఆకలి. దానికి వరమిచ్చిన బ్రహ్మ దాన్ని అంతం చేయడానికి చెప్పిన విషూచిక మంత్రం..


కరోనా వచ్చిన నేపథ్యంలో అనేకానేక కథలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే వీటన్నింటిలో ప్రధానమైనవి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి వ్యాధి, యోగా వాసిష్ఠంలో కర్కటి కథ. ప్రస్తుతం యోగా వాసిష్ఠంలో కర్కటి కథ తెలుసుకుందాం…
యోగా వాసిష్ఠంలో కర్కటి అని ఓ మహారాక్షసి. దానిది అంతులేని ఆకలి. ఎన్ని వందల, వేల మంది మనుషుల్ని అప్పడాల్లా నమిలేసినా దానికి ఆకలి తీరేది కాదు.

ఇలా కాదు; భూలోకంలోని సమస్త ప్రాణులనూ ఒకేసారి మింగ గలిగితే ఎంత బాగుండు. అనేది దాని బాధ. అలా అయితే కానీ నాకు కడుపు నిండదు. అని ఆ రాక్షసికి ఓ చిన్న కోరిక పుట్టింది. ఎడతెగని ఆకలి బాధ తీరటానికి అదొక్కటే దారి అని దానికి తోచింది.ఎలాగైనా దాన్ని సాధించి తీరాలని ఒంటికాలి మీద నిలబడి తీవ్రమైన తపస్సు చేసింది.

హిమాలయ శిఖరం మీద వెయ్యేళ్ళ పాటు సాగిన రాక్షసి భీకర తపస్సు ధాటికి లోకాలు అల్లాడాయి. బ్రహ్మదేవుడు దిగివచ్చి వరం కోరుకోమన్నాడు. “ముక్కు ద్వారా వాసన లోపలికి పోయినంత తేలిగ్గా నేను వ్యాధి రూపంలో మనుషుల హృదయంలోకి ప్రవేశించాలి. జీవమున్న సూదిలా సూక్ష్మరూపంలో వ్యాపించి ప్రపంచంలోని జీవులను కడుపారా భోంచేయాలి. ఆ ఒక్క వరమివ్వు చాలు “అన్నది కర్కటి. బ్రహ్మగారు సరే అన్నాడు.

నువ్వు కోరుకున్నట్టే సూక్ష్మాతి సూక్ష్మమైన సూది రూపంలో ‘విషూచిక’ అనే పేరుగల వాత రోగానివి అవుతావు. ప్రజల ప్రాణవాయువు ద్వారా ముక్కులోంచి ప్రవేశించి మనుషుల హృదయ ప్రదేశాన్ని ఆక్రమిస్తావు. గుండె, కాలేయం ,ఊపిరితిత్తులు లాంటి అవయవాలను పీడించి వారిని నాశనం చేస్తావు ‘ అని వరమిచ్చాడు. అయితే దానికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి అని బ్రహ్మ దేవుడు చెప్పాడు.. అవి .. తినకూడని వాటిని తినేవారిని,చెయ్యకూడని పనులు చేసేవారిని, చెడు ప్రదేశాల్లో ఉండేవారిని, శాస్త్ర వ్యతిరేకంగా నడిచేవారిని, దుర్మార్గులను సుబ్బరంగా హింసించి ఆరగించవచ్చు.

అయితే ఈ మాయరోగం అన్నది వ్యాపించాక , చెడ్డవాళ్ళతో పాటు మంచి వాళ్ళూ దాని బారిన పడతారు. అయితే దానినుంచి బయటపడటానికి బ్రహ్మగారు మంత్రరూపంలో ఓ కొన్ని వరాన్ని మానవులకు ఇచ్చాడు.. ఆ మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠిస్తే చాలు గుణవంతులు విషూచికా వ్యాధి కోరల నుంచి తప్పించుకోగలరని తెలిపారు.వేల సంవత్సరాల కిందటి యోగ వాసిష్ఠంలోని ఉత్పత్తి ప్రకరణం లో ఈ కథవింటే దానికీ మనలను ఇప్పుడు వొణికిస్తున్న కరోనా వైరస్ కూ చాలా పోలికలు కనిపిస్తాయి.
ఈ వైరస్ కూడా ముక్కుద్వారానో , మూతిద్వారానో , చేతుల ద్వారానో ప్రాణవాయువుతోబాటు లోపలికి పోయి గుండెలోనో, దానిదగ్గరి ఊపిరి తిత్తులలోనో,పక్క వాటాలోనో కాపురం పెట్టి నానా బీభత్సం చేస్తుందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

ముంచుకొచ్చిన పీడకు మందు ఏమిటో పాలుపోక ఆధునిక వైద్యశాస్త్రం అహర్నిశలు కష్టపడుతూ పరిశోధనలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కనీసం ఏడాది పట్టవచ్చు. అయితే అప్పటి వరకు మనకు కేవలం నియంత్రణ, ఎవరికి వారే ప్రభుత్వం చెప్తున్న నియమాలను, లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి. ఎవరికి వారే బాగుండటమే కాకుండా ఇంట్లో కూర్చుని లోక శ్రేయస్సుకు పాటుపడే అద్భుత అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటే లోకానికి మంచిది.
అయితే యోగా వాసిష్ఠంలో బ్రహ్మగారు విషూచిక మంత్రం తెలుసుకుందాం..

ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణు శక్తయే నమః
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం
ఓం హరహర నయనయ పచపచ మథమథ
ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ
సః సః సః చంద్రమండల గతోసి స్వాహా..!

( ఈ మంత్రాన్ని ప్రతీ రోజు ఉభయ సంధ్యలలోను 11 పర్యాయాలు తక్కువ కాకుండా మీరు చేయగలిగినన్ని సార్లు పఠిస్తే తప్పక విషూచిక నుంచి బయటపడుతారు అని యోగావాసిష్టంలో ఉంది.)

ఈ కథలు ఆయా పుస్తకాలలో ఉన్నవి. కేవలం సనాతన ధర్మంలో చెప్పుకునే పురాణాలు, పెద్దల, పండితులు ఆయా సందర్భాలలో చెప్పినవి మాత్రమే. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం విషయం తెలుసుకోవడానికి మాత్రమే. ఎవరిని బాధపెట్టాలనో, వీటినే నమ్మాలనో చెప్పట్లేదు. కేవలం సమాచారం మాత్రమే. మిగిలినదంతా పాఠకుల విజ్ఞతకే వదిలివేస్తున్నాం.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news