ఆన్లైన్ లావాదేవీల యుగంలో సౌకర్యంతో పాటు సైబర్ మోసాల భయం కూడా పెరిగిపోయింది. కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో మాయమైతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, డిజిటల్ ఫ్రాడ్ బారిన పడిన బాధితులకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను వెలువరించింది. మీ తప్పు లేకుండా ఖాతాలో డబ్బులు పోతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిహారం పొందే అవకాశం ఉంది. ఆ వివరాలేంటో మనం ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం.
మీ డబ్బుకు ఆర్బీఐ భరోసా: డిజిటల్ మోసాలు జరిగినప్పుడు సామాన్యులు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఆర్బీఐ ‘లిమిటెడ్ లయబిలిటీ’ (పరిమిత బాధ్యత) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బ్యాంక్ వైపు నుంచి భద్రతా లోపాలు ఉన్నా లేదా మూడవ పక్షం (Third-party) తప్పు వల్ల మీ ఖాతాలో నగదు మాయమైనా ఆ నష్టాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది. బాధితులు సరైన సమయంలో స్పందిస్తే రూ. 25,000 వరకు లేదా అంతకంటే ఎక్కువ నష్టపరిహారం పొందే వీలుంది.

3 రోజుల గోల్డెన్ రూల్: సైబర్ మోసం జరిగినప్పుడు సమయం చాలా ముఖ్యం. మీ ఖాతా నుండి అనధికారికంగా నగదు డెబిట్ అయినప్పుడు, వెంటనే (అంటే 3 పని దినాలలోపు) బ్యాంకుకు సమాచారం అందించాలి. ఇలా గడువులోపు ఫిర్యాదు చేస్తే పోయిన పూర్తి సొమ్మును తిరిగి పొందే బాధ్యత బ్యాంకులపై ఉంటుంది. మీరు ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోపు ఆ నగదును మీ ఖాతాలో తాత్కాలికంగా క్రెడిట్ చేయాలని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
సకాలంలో స్పందించకపోతే ఏమవుతుంది?: ఒకవేళ మీరు 4 నుండి 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, మీ బాధ్యత (Liability) పెరుగుతుంది. అంటే నష్టపోయిన మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే బ్యాంక్ ఇస్తుంది. సాధారణంగా పొదుపు ఖాతాదారులకు ఇది గరిష్టంగా రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు పరిమితి ఉంటుంది. 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంక్ పాలసీని బట్టి నిర్ణయం ఉంటుంది. అందుకే మెసేజ్ రాగానే అప్రమత్తమవ్వడం చాలా అవసరం.
మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవటం ముఖ్యం. ఇక పరిహారం వస్తుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీ ఓటీపీ (OTP) పిన్ (PIN) నంబర్లు ఎవరికీ చెప్పకండి. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. ఒకవేళ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి.
