సాధారణంగా మహిళల్లో 45 నుంచి 50 ఏళ్లు దాటాక పీరియడ్స్ (నెలసరి) ఆగిపోతుంటాయి. దీనినే మెనోపాజ్ అంటారు. కానీ, ఇప్పుడు మనదేశంలో ఒక షాకింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది మహిళల్లో 40 ఏళ్ల లోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయి. దీనిని వైద్య పరిభాషలో ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. వయసుతో సంబంధం లేకుండా ఇలా జరగడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అసలు కారణాలు ఏంటి?: వయసు కంటే ముందే పీరియడ్స్ ఆగిపోవడానికి ముఖ్య కారణం మన మారిన జీవనశైలే. ఈ రోజుల్లో మహిళలపై ఇల్లు, ఆఫీస్ బాధ్యతల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) పెరుగుతోంది. ఇక దీనికి తోడు జంక్ ఫుడ్స్ తినడం, శారీరక శ్రమ లేకపోవడం, పెరుగుతున్న వాయు కాలుష్యం, నిద్రలేమి వంటి కారణాల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఇలా ముందే పీరియడ్స్ ఆగిపోతున్నాయి.

ఎలాంటి సమస్యలు వస్తాయి?: ముందుగానే మెనోపాజ్ రావడం వల్ల మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, విపరీతమైన నీరసం వస్తాయి.ఇక అంతేకాదు, చిన్న విషయాలకే చిరాకు పడటం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి. వీటన్నిటితో పాటు భవిష్యత్తులో గుండె జబ్బులు, ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
ఇక ముందుగా వచ్చే మెనోపాజ్ భయంకరమైన సమస్యే అయినప్పటికీ, సరైన అవగాహనతో దీనిని ఎదుర్కోవచ్చు. రోజువారీ అలవాట్లలో మార్పులు చేసుకోవడం, యోగా లేదా వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
గమనిక: 40 ఏళ్ల లోపే మీకు పీరియడ్స్ సరిగ్గా రాకపోయినా లేదా పూర్తిగా ఆగిపోయినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే మంచి గైనకాలజిస్ట్ను సంప్రదించి, వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.
