మనలో చాలా మందికి భోజనం ముగిశాక ఏదో ఒక స్వీటో లేదా పండో తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా అన్నం తిన్న వెంటనే మామిడి పండు లేదా అరటి పండును లాగించేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల శరీరానికి ఒకేసారి భారీగా క్యాలరీలు, చక్కెరలు అందుతాయి. దీనివల్ల బరువు పెరగడంతో పాటు, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయి. మరి పండ్లను ఎప్పుడు తినాలి? ఖాళీ కడుపుతో ఖర్జూరం, అరటి పండ్లలో ఏది బెస్ట్? ఇప్పుడు చూద్దాం.
అన్నం తిన్న వెంటనే తింటే గ్యాస్ ట్రబుల్: ఉడికించిన అన్నం, పచ్చి పండ్లు ఒకేసారి కడుపులోకి వెళ్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. అన్నం అరగడానికి, పండ్లు అరగడానికి పట్టే సమయం వేరువేరుగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే భోజనానికి రెండు గంటల తర్వాత లేదా సాయంత్రం స్నాక్లాగా పండ్లను తినడం మంచిది.
పరగడుపున ఖర్జూరం.. ఇన్స్టెంట్ ఎనర్జీ: ఉదయం ఖాళీ కడుపుతో తినడానికి ఖర్జూరం చాలా ఉత్తమమైనది. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్ (పీచు పదార్థం) శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తింటే రోజంతా యాక్టివ్గా ఉండటానికి అవసరమైన ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. అంతేకాదు, ఇది జీర్ణవ్యవస్థను క్లీన్ చేసి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

ఖాళీ కడుపుతో అరటి పండు.. జాగ్రత్త సుమా: అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును నేరుగా తినడం అంత మంచిది కాదు.ఇక ఎందుకంటే పరగడుపున ఇది తినడం వల్ల రక్తంలో మెగ్నీషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అలాగే ఇందులోని సహజ చక్కెరల వల్ల కాసేపటికే మళ్లీ నీరసంగా అనిపిస్తుంది.
అరటి పండు తినాలంటే ఇలా చేయండి: ఒకవేళ మీకు ఉదయాన్నే అరటి పండు తినే అలవాటు ఉంటే, దాన్ని ఒంటరిగా కాకుండా వేరే పదార్థాలతో కలిపి తీసుకోండి. ఇక ఉదాహరణకు నానబెట్టిన బాదంపప్పులు, ఓట్స్ లేదా గంజి వంటి వాటితో కలిపి అరటి పండు తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల బాడీకి పోషకాలు సరిగ్గా అందుతాయి.
పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ, వాటిని తినే టైమింగ్ చాలా ముఖ్యం. అన్నం తిన్న వెంటనే మామిడి, అరటి పండ్లకు దూరంగా ఉండండి. ఇక ఖాళీ కడుపుతో తినడానికి అరటి పండు కంటే ఖర్జూరమే బెస్ట్ ఛాయిస్. ఒకవేళ అరటి పండు తినాలనుకుంటే దాంతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ జత చేయడం మాత్రం మర్చిపోకండి.
గమనిక: షుగర్ (డయాబెటిస్) ఉన్నవారు ఖాళీ కడుపుతో ఎక్కువ స్వీట్ ఉండే పండ్లను తినకూడదు. మీ డైట్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఒకసారి మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
