భూగోళం వేడెక్కడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. ఇది మన మనుగడకే ప్రమాదంగా మారింది. అందుకే శాస్త్రవేత్తలు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. బ్రిటన్ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఆండ్రియా సెకోలినీకి చెందిన ‘రియల్ ఐస్’ అనే కంపెనీ కరిగిపోతున్న ఆర్కిటిక్ సముద్రాన్ని మళ్లీ గడ్డకట్టించే ఒక క్రేజీ ప్రయోగాన్ని చేస్తోంది. ఈ జియోఇంజినీరింగ్ ప్రయోగం మొదటి దశలోనే మంచి ఫలితాలను ఇచ్చి అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
సముద్రపు నీటితో మంచుకు మల్టీప్లైర్ థెరపీ: ఈ ప్రయోగం ఎలా పనిచేస్తుందంటే.. ఆర్కిటిక్ మంచుపై రంధ్రాలు చేసి, కింద ఉన్న సముద్రపు నీటిని పైకి పంప్ చేస్తారు. తీవ్రమైన చలికి ఆ నీరు వెంటనే గడ్డకట్టుకుపోతుంది. ఐదు నెలల క్రితం శాస్త్రవేత్తలు -40 డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా 50,000 టన్నుల సముద్రపు నీటిని పంప్ చేశారు. ఇక దీనివల్ల 1.5 మీటర్ల లోతున్న మంచు పొరపై అదనంగా మరో 50 సెంటీమీటర్ల మందపాటి మంచు ఏర్పడింది. ‘ఆర్కిటిక్ రిఫ్లెక్షన్స్’ అనే మరో సంస్థ కూడా ఇలాగే చేసి 45 సెం.మీ మంచును తయారు చేసింది.

సహజంగా దొరికిన సుడిగుండాల ఐడియా: మంచులో సహజంగా ఏర్పడిన కొన్ని రంధ్రాల గుండా నీరు సుడులు తిరుగుతూ పైకి రావడాన్ని శాస్త్రవేత్తలు మొదట గమనించారు. అదే ప్లాన్తో లాంగ్ డ్రిల్ మెషిన్ ఉపయోగించి ఐస్పై 5 సెం.మీ వెడల్పున్న ఆరు రంధ్రాలు వేశారు. ఇక కేంబ్రిడ్జ్ బే అనే ప్రాంతంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంపులు రాత్రింబవళ్లు 1,080 గంటల పాటు పనిచేసి, సుమారు 450 చదరపు మీటర్ల ఏరియాను గడ్డకట్టేలా చేశాయి. పైకి వచ్చిన నీరు బురదగా మారి, గాల్లోని చలి వల్ల గట్టిపడి కింద అదనపు మంచు పెరిగేలా చేస్తోంది.
శాస్త్రవేత్తల నుంచే వస్తున్న వ్యతిరేకత: మంచు మందాన్ని పెంచే ఈ ఐడియా బాగున్నప్పటికీ, ధ్రువ ప్రాంతాలపై రీసెర్చ్ చేసే చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇక మనం అసలైన సమస్య అయిన కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మానేసి, ఇలాంటి ప్రయోగాల వెంట పడితే వాతావరణానికి మరింత నష్టం జరుగుతుందని గత సెప్టెంబరులో ఒక నివేదికను కూడా ఇచ్చారు.
మూగజీవాలకు ముప్పు తెచ్చే ప్రమాదం: శీతాకాలంలో మంచుపైకి ఉప్పునీటిని పంప్ చేయడం వల్ల అక్కడి జీవావరణం దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన పడుతున్నారు. ఇక మంచు పొరల స్వభావం మారడం వల్ల, ధ్రువపు ఎలుగుబంట్లు సీల్స్ వంటి జంతువులు తమ పిల్లల కోసం మంచులో గుహలు తవ్వుకోలేవని చెబుతున్నారు. ఇది ఆ వన్యప్రాణుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉంది.
ఇక ఆర్కిటిక్ను తిరిగి గడ్డకట్టించే ప్రయోగం ఒక అద్భుతమైన తాత్కాలిక ప్లాన్ లా కనిపిస్తున్నప్పటికీ, అది ప్రకృతి సహజత్వానికి విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
గమనిక: పర్యావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వినూత్న ప్రయోగాలు శాస్త్రవేత్తల భిన్నాభిప్రాయాల ఆధారంగా ఈ సమాచారం అందించడం జరిగింది.
