ఈ రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలా మంది ఉదయాన్నే రకరకాల పండ్ల రసాలు తాగుతుంటారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్ పూర్తిగా మానేసి మరీ జ్యూస్ల మీదే ఆధారపడతారు. ముఖ్యంగా ఉదయం వాకింగ్ జాగింగ్ ముగించుకుని రాగానే చల్లటి జ్యూస్ తాగడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అయితే పరగడుపున ఇలా జ్యూస్లు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిట్రస్ జ్యూస్లతో ఎసిడిటీ ముప్పు: నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా బత్తాయి (సీజనల్) వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి పండ్ల రసాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం అస్సలు మంచిది కాదు. పరగడుపున ఇవి తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం విపరీతంగా పెరిగిపోయి.. గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.

చల్లని జ్యూస్లు అస్సలు వద్దు: ఉదయాన్నే నిద్ర లేవగానే లేదా వ్యాయామం చేసిన వెంటనే ఫ్రిజ్లో పెట్టిన చల్లటి జ్యూస్లు తాగడం మరో పెద్ద తప్పు. ఇక ఇలా చల్లని ద్రవాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలోని శ్లేష్మ పొరలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మన జీర్ణవ్యవస్థ పనితీరును మందగించేలా చేస్తుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
బ్రేక్ ఫాస్ట్కు ప్రత్యామ్నాయం కాదు: చాలా మంది బరువు తగ్గాలనే తాపత్రయంలో ఉదయం పూట తినే టిఫిన్ను పూర్తిగా మానేసి కేవలం జ్యూస్లతోనే కడుపు నింపేస్తుంటారు. కానీ, పండ్లను నేరుగా తినడానికి, వాటిని రసం రూపంలో తాగడానికి చాలా తేడా ఉంటుంది. జ్యూస్ చేసినప్పుడు అందులోని ఫైబర్ (పీచు పదార్థం) పోతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం కూడా ఉంది.
ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివే అయినప్పటికీ, వాటిని తాగే సమయం చాలా ముఖ్యం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకుండా.. బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తర్వాత లేదా మధ్యాహ్నం పూట జ్యూస్ తాగడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు అందుతాయి. అలాగే ఫ్రిజ్ వాటర్ కాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉండే జ్యూస్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన మరియు ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలపై ఆధారపడి ఇవ్వబడింది. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఇప్పటికే గ్యాస్ట్రిక్, అల్సర్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ డైట్లో మార్పులు చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించడం మంచిది.
