రోజూ ఉదయాన్నే పరగడుపున చిన్న చిన్న వ్యాయామాలు లేదా యోగాసనాలు చేయడం వల్ల రోజంతా ఎంత ఉత్సాహంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాంటి వాటిలో ‘మలాసనం’ (స్క్వాట్ పోజ్) చాలా సులభమైనది, అంతేకాకుండా అద్భుతమైన ప్రయోజనాలను ఇచ్చే ఆసనం. ఈ యోగాసనం చేయడం వల్ల మన శరీరానికి, మానసిక ప్రశాంతతకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయం ఖాళీ కడుపుతో మలాసనం వేయడం వల్ల పొత్తికడుపు భాగంలో ఒత్తిడి కలిగి జీర్ణవ్యవస్థ బాగా చురుగ్గా మారుతుంది. ఇక ఇది గ్యాస్, అజీర్తి మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి రోజంతా శరీరాన్ని తేలికగా, ఉత్సాహంగా ఉంచుతుంది.
కండరాలకు బలం, బిగుతు నుంచి ఉపశమనం: మలాసనం వేయడం వల్ల తొడలు, పిక్కలు మరియు తుంటి కండరాలు బాగా బలపడతాయి. ఇక రోజంతా ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారికి నడుము, నడుము కింది భాగం, చీలమండలాల్లో వచ్చే బిగుతును తగ్గించడంలో ఈ ఆసనం చాలా బాగా సహాయపడుతుంది.

మానసిక ప్రశాంతత, ఏకాగ్రత: ఈ ఆసనం శారీరక ఆరోగ్యానికే కాక మానసిక ప్రశాంతతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి, శ్వాసకు మధ్య సమన్వయాన్ని పెంచి మనసును స్థిరంగా ఉంచుతుంది. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచడంలో ఇది తోడ్పడుతుంది.
గర్భిణులకు ఎంతో మేలు: మలాసనం చేయడం వల్ల కటివలయ (పెల్విక్) కండరాలు బలపడతాయి. అందువల్ల ఇది గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
రోజూ ఉదయాన్నే కొద్దిసేపు మలాసనం సాధన చేయడం ద్వారా మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. ఈ సులభమైన అలవాటుతో మీ ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని ఈరోజే ప్రారంభించండి!
గమనిక: మోకాళ్లు, చీలమండలు లేదా వెన్నునొప్పితో బాధపడేవారు, ఇటీవల పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఈ ఆసనం వేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని సాధన చేయాలి.
