తిరుమలలో ధనుర్మాసంలో సుప్రభాతం ఉండదు. తులసీ వాడరు… మరేం చేస్తారో మీకు తెలుసా!

-

దక్షిణాయన పుణ్యకాలం చివరి దశకు చేరకుంది. ఉత్తరాయణం మరో ఇరవై రోజుల్లో ప్రారంభం కానున్నది. అయితే కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాతాన్ని ఈ మాసంలో చదవరు. అయితే ఏం చేస్తారో తెలుసుకుందాం… ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు.

సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణనానికి ముందుడే ధనుర్మాసం ప్రాత:కాలంలా పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధను అనగా దేని కోసం ప్రార్థించడమనే అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు.

వేదాల సారమే తిరుప్పావై !
మార్గశిర పౌర్ణమి తర్వాత పాఢ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ధనుస్సంక్రమణ రోజున నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. వైష్ణవ, సూర్యాలయాలను కూడా సందర్శించడం కూడా శుభప్రదం. ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురణాల్లో పేర్కొన్నారు.

ఇలా చేస్తే వివాహం అవుతుంది !
ఈ మాసంలో శ్రీ మహా విష్ణువును మధుసూధనుడు పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనాన్ని నివేదించాలి. పెళ్లీడు కొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలతో పూజ చేయడ వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. రోజూ ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. ధనుర్మాసంలో రోజూ శ్రీకృష్ణుడికి తులసి మాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం.

ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలు, భాగవతం, నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి. ​అవివాహితులు, మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో ఐక్యమైపోయింది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news