అవతార్‌-2 వచ్చేస్తోంది..

-

పదేళ్ల క్రితంవచ్చి, యావత్‌ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘అవతార్‌’ చిత్రానికి సీక్వెల్‌ ‘అవతార్‌2’ వచ్చే ఏడాది డిసెంబర్‌లో కనువిందు చేయనుంది. జేమ్స్‌ కామెరూన్‌ సృజనాత్మకతకు విశ్వరూపం అయిన అవతార్‌కు విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది.

అవతార్‌… 2009లో వచ్చిన ఈ ఇంగ్లీషు సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ‘పండోరా’ అనే ఒక విచిత్రమైన గ్రహాంతర లోకాన్ని పరిచయం చేసి మనందరినీ అక్కడికి తరలించాడు దర్శకుడు జేమ్స్‌ కామెరున్‌. కోట్లాది డాలర్లవర్షం కురిసింది. ఆస్కార్‌తో సహా అనేక అవార్డులు దాసోహమన్నాయి. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో కామెరున్‌ దానికి సీక్వెల్‌ తీస్తానని, 2014లో విడుదల చేస్తానని ప్రకటించాడు. తీరా మొదలుపెట్టేనాటికి, ఒకటి కాదు, నాలుగు తీస్తానని ఒకేసారి రెండు సీక్వెల్‌లు స్టార్ట్‌ చేసాడు. రేపు మాపు అనుకుంటూ, మొత్తానికి 2021 డిసెంబర్‌ అని నిన్న కన్స్యూమర్‌ ఎగ్జిబిషన్‌ షోలో ప్రకటించాడు. అంతే కాకుండా అవతార్‌2 తాలూకు కాన్సెప్ట్‌ చిత్రాలను విడుదల చేసాడు.

2017లో ఏకకాలంలో రెండు సీక్వెల్‌లు చిత్రీకరణ ప్రారంభించుకున్నప్పటికీ, వాటి వివరాలు మాత్రం అత్యంత గోప్యంగా ఉంచబడ్డాయి. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం, అవతార్‌2 కథ మొదటి కథ తర్వాత చాలా ఏళ్లకు ప్రారంభమవుతుంది.  ఇక్కడ తర్వాతి తరం వారు పరిచయం అవుతారు. జాక్‌-నేత్రీల పిల్లలు, అక్కడే జన్మించిన ఒక మానవ శిశువు, కొత్త నవీ పిల్లలు పండోరా సముద్ర అంతర్భాగాన ఎలా ఈదాలి? అనే విషయంపై తర్ఫీదు పొందుతున్నట్లు కాన్సెప్ట్‌ చిత్రాల ద్వారా అర్థమవుతుంది.

జాక్‌ సుల్లీ (సామ్‌ వర్తింగ్‌టన్‌), నేత్రీ (జో సల్దానా) లతో పాటు రెండవ భాగంలో సిగౌర్నీ వీవర్‌, స్టీఫెన్‌ లాంగ్‌ కూడా ఉంటారు. కొత్తగా కేట్‌ విన్‌స్లెట్‌, క్లిఫ్‌ కర్టిస్‌ చేరారు. డిసెంబర్‌ 18, 2021 న అవతార్‌2 మొదటి ప్రీమియర్‌ షో ప్రదర్శింపబడనున్నది.

 

Read more RELATED
Recommended to you

Latest news