అత్త కాదు అమ్మ‌… కొడుకు చ‌నిపోతే కోడ‌లికి మ‌ళ్లీ పెళ్లి

-

సాధార‌ణంగా అత్తాకోడళ్ల గొడవలు ప్ర‌తీ ఇంట్లోనూ ఉండేవే. కానీ అవి మితిమీరితే మాత్రం ఎన్నో అన‌ర్థాల‌కు దారితీస్తాయి.  అత్తింటి వేధింపులకు అనేక మంది కోడళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ శాతం అత్తా కోడ‌ళ్ల‌కు  ఏమాత్రం పొసగదు. ఒకరిని చూస్తే మరొకరికి కడుపు మంట ఉంటుంది. అయితే ఇటువంటి భావన తప్పని చాలా మంది అత్తా కోడళ్లు తమ ప్రవర్తనతో నిరూపించారు. ఈ క్ర‌మంలోనే ఒడిశా రాష్ట్రం అనుగుల్ ఏరియా గోబరా గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ప్రతిమ బెహరా అమ్మను మరిపించిన అత్తగా ప్రశంసనీయమైన పాత్ర పోషించింది.

ఆ మ‌హిళ తల్లిలా మారి వితంతు కోడలికి మరో పెళ్లి చేసి అత్తలకు ఆదర్శంగా నిలిచింది. 2019 ఫిబ్రవరిలో ప్రతిమ బెహరా కుమారుడు రష్మీ రంజన్‌కు సమీప తురాంగ గ్రామానికి చెందిన లిల్లీతో వివాహం జ‌రిగింది. ఆ జంట ఎంతో ఆనందంగా తమ వైవివాహిక జీవితాన్ని గడుపుతున్నారు.  అయితే విధి వక్రీకరించి పెళ్లైన ఐదు నెలల‌కే రష్మీ రంజన్ బొగ్గు గని ప్రమాదంలో మ‌ర‌ణించాడు. చెట్టంత కొడుకు పోయాడని ప్రతిమ, భర్త ఇక లేడు అన్న విషయం లిల్లీ జీర్ణించుకోలేకపోయారు.  దీంతో లిల్లీ బెహరా వితంతువుగా మారింది.


త‌న కుమారుడు ఎలాగో తిరిగి రాడ‌ని భావించిన ఆ త‌ల్లి.. 20 ఏళ్ళ ప్రాయంలోనే వితంతువైన కోడలిని చూసి త‌ట్టుకోలేక‌పోయింది. దీంతో తన జీవితం అయినా బాగుండాలి అని ఆమె కోడ‌ల‌కు మ‌ళ్ళీ పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే తానే స్వ‌యంగా తన బంధువు కుమారుడు సంగ్రామ్‌తో పాటు ఆయన తల్లిదండ్రుల‌ను కూడా ఒప్పించింది. ఈ క్ర‌మంలోనే లిల్లీ వివాహం త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలో ఈ నెల11న  అనుగుల్‌లోని జగన్నాథ ఆల‌యంలో ఘనంగా చేశారు. వాస్త‌వానికి అత్త‌గా కాకుండా త‌ల్లీగా ఆలోచించి కోడ‌లి భ‌విష్య‌త్తును తీర్చిదిద్దిన ప్రతిమ బెహరాను శ‌భాష్‌ అన్నాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news