నేటి ప్రపంచంలో స్మార్ట్ఫోన్ లేని నిమిషాన్ని ఊహించుకోవడం కష్టమే. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితం గ్యాడ్జెట్స్తోనే ముడిపడి ఉంది. అయితే, మనం టెక్నాలజీని వాడుతున్నామా లేక టెక్నాలజీ మనల్ని వాడుకుంటోందా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అవసరానికి మొదలైన ఈ డిజిటల్ ప్రయాణం తెలియకుండానే మనల్ని గందరగోళంలోకి నెట్టేసి వ్యసనంగా మారుతోంది. ఈ చిక్కుముడిని విప్పి మన జీవితాన్ని మనం ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియా మాయలో నేటి తరం: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇవి సమాచారం పంచుకోవడానికి అవసరమైన వేదికలే. కానీ, నేటి తరం వీటిపై గడుపుతున్న సమయం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నిమిషం నోటిఫికేషన్ రాకపోతే ఏదో కోల్పోతున్నామనే అనే ఆందోళనలో యువత ఉంది.
అవసరమైన సమాచారం కోసం కాకుండా, కేవలం లైక్లు, కామెంట్ల కోసం గంటల తరబడి స్క్రోల్ చేయడం వ్యసనానికి సంకేతం. ఇది మన మెదడులోని ‘డోపమైన్’ స్థాయిలను ప్రభావితం చేస్తూ నిత్యం ఆ డిజిటల్ లోకంలోనే ఉండేలా మనల్ని బానిసలుగా మారుస్తోంది.

డిజిటల్ డిటాక్స్ – ప్రశాంతతకు మార్గం: టెక్నాలజీని పూర్తిగా వదిలేయలేము, కానీ దాన్ని నియంత్రించవచ్చు. ‘అవసరమా? వ్యసనమా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే ఈ గందరగోళం నుంచి బయటపడగలం. రోజులో కొంత సమయాన్ని గ్యాడ్జెట్స్ లేకుండా గడపడం ప్రకృతితో సమయం గడపడం, పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు మన మెదడును తిరిగి పునరుజ్జీవింపజేస్తాయి.
ప్రతి పనికీ ఫోన్పై ఆధారపడకుండా, మన ఏకాగ్రతను మన పనుల మీద పెట్టడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. అవసరానికి మాత్రమే టెక్నాలజీని వాడుతూ, నిజమైన మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవడమే ఈ తరం చేయాల్సిన అతిపెద్ద పని.
టెక్నాలజీ అనేది మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చిన ఒక సాధనం మాత్రమే, అది మన జీవితమే కాకూడదు. అవసరాన్ని గుర్తించి వ్యసనాన్ని నియంత్రించగలిగితేనే మనం నిజమైన స్వేచ్ఛను అనుభవించగలం. స్మార్ట్ఫోన్ను పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్లతో చూడండి స్క్రీన్లతో కాదు.
