మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేదు. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.ఈ అఫిడవిట్లో ఆశ్చర్యకరమైన విషయాలను చంద్రబాబు సర్కార్ వెల్లడించింది.
కృష్ణారెడ్డి ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్రెడ్డి ప్రయత్నించారని అందులో పేర్కొంది. సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారని.. అందులో భాగంగానే సీబీఐ అధికారి రామ్సింగ్, సునీత, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేశారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింది. ఇక తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఇటీవల మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.