తెలంగాణలో మరో గురుకుల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని (నల్లవాగు) సుల్తానాబాద్ గురుకుల పాఠశాలలో పెద్ద శంకరంపేట మండలం చిలపల్లికి చెందిన దార నిఖిల్ కుమార్ (9వ తరగతి) చదువుతున్నాడు. అయితే, వారం రోజుల నుంచి నిఖిల్ జ్వరంతో బాధపడుతున్నాడు.
పాఠశాలలో ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. దీంతో కుటుంబ సభ్యులకు చెప్పగా.. రెండు రోజుల కిందట తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వచ్చి నిఖిల్ను నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మరల సంగారెడ్డి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో నిఖిల్ చనిపోయాడు. అయితే, గురుకుల ప్రిన్సిపల్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు.