దేశ రాజధానిలో భద్రతా పరిస్థితులపై శుక్రవారం ఉదయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA)కు ఈ హెచ్చరిక ఈ-మెయిల్ రూపంలో అందగా, దేశవ్యాప్తంగా పాకిస్థాన్కు విధేయంగా ఉన్న స్లీపర్ సెల్స్ దాడికి సిద్ధంగా ఉన్నాయని దానిలో పేర్కొనడం భయభ్రాంతులకు దారితీసింది. ఈ స్టేడియం ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్గా ఉంది. మే 11న ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ అయినప్పటికీ, బీసీసీఐ ఇప్పటికే టోర్నీని వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ బెదిరింపు ఈ-మెయిల్ విషయాన్ని DDCA అధికారి ధృవీకరించారు. “ఈ ఉదయం మాకు ఈమెయిల్ వచ్చింది. దానిని వెంటనే పోలీసులకు అందజేశాం. వారు స్టేడియాన్ని పూర్తిగా తనిఖీ చేశారు,” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపు వెనుక ఉన్న మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో, హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం మరింత కలకలం రేపింది. “ఏ క్షణమైనా పేల్చేస్తాం. ప్రభుత్వానికి చెప్పండి” అంటూ పాక్ స్లీపర్ సెల్స్ పేరుతో వచ్చిన ఈమెయిల్ ఆధారంగా, అధికారులు వెంటనే అప్రమత్తమై, ఎయిర్పోర్టులో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ రెండు సంఘటనలు దేశంలో సున్నిత భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే అనుమానిత లింకులపై విచారణ చేపట్టారు.