ఆ నీళ్లు తాగే దమ్ము కేసీఆర్‌కు ఉందా : బండి సంజయ్

-

ప్రజా సంగ్రామయాత్రను ఆపాలని ప్రభుత్వం కుట్రలు చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు. సీఎం కేసీఆర్‌.. ప్రధాని, భాజపా నేతలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. కలెక్టరేట్ ప్రారంభం అనేది అధికారిక కార్యక్రమమన్న బండి.. కానీ అక్కడ రాజకీయ విమర్శలు సీఎం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేంద్రాన్ని, ప్రధానిని… సీఎం కేసీఆర్‌ ఎలా విమర్శిస్తారని విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ అభివృద్ధి చేశానని అనుకుంటే.. ఏ జిల్లాకు పోతే అక్కడ ఏం చేశారో సీఎం చెప్పాలని సవాల్ విసిరారు. ఎంత మందికి ఇళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ నీళ్లు పంపిస్తే.. తాగే దమ్ము సీఎంకు ఉందా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version