సభ్యత్వం లేకపోయినా.. జీ20 సదస్సుకు బంగ్లా ప్రధాని హసీనా

-

భారత్​లో సెప్టెంబరులో నిర్వహించనున్న జీ20 సదస్సుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులకు కేంద్ర సర్కార్ ఆహ్వానాలు కూడా పంపింది. అయితే జీ20 సదస్సుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా హాజరయ్యే అవకాశాలున్నాయని అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భారత ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందిందని తెలిపారు.

జీ20 కూటమికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. సన్నాహక సమావేశాల్లో భాగంగా సెప్టెంబరు 9, 10న దిల్లీలో వివిధ ప్రభుత్వాధినేతలతో కేంద్రం భేటీ నిర్వహించనుంది. జీ20 కూటమిలో బంగ్లాదేశ్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ అతిథి హోదాలో హసీనా ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి.

సంప్రదాయం ప్రకారం ఈ సదస్సుకు ఆతిథ్యమిచ్చే దేశం.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర సంస్థలతోపాటు కొన్ని అతిథి దేశాలనూ ఆహ్వానిస్తుంది. దక్షిణాసియాలో ఈ ఆహ్వానాన్ని బంగ్లాదేశ్‌ ఒక్కటే అందుకుంది. జీ20లో సభ్యత్వం లేని ఈజిప్ట్‌, మారిషస్‌, నెదర్లాండ్స్‌, నైజీరియా, ఒమన్‌, సింగపూర్‌, స్పెయిన్‌, యూఏఈ దేశాలకూ ఈ ఆహ్వానం అందనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version