ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం.. మరోవైపు.. జనసేన అవిర్భావ సభలో పవన్ కల్యాణ్
ప్రసంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఎం పొలిట్బ్యరో సభ్యులు బీవీ రాఘవులు.. విశాఖలోని కుర్మన్నపాలెం దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపుతున్నారు.. కాంట్రాక్టు కార్మికులను తీసేస్తున్నారు.. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని అమ్మేసి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తున్నారని మండిపడ్డారు.. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ధి జరగదన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు, సెయిల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందన్నారు.
ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ తీసుకోవాల్సిన పరిస్థితి. రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి.. దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలనుకోవడమే అని ఆరోపించారు.. స్టీల్ ప్లాంట్ భూములను కోళ్లగొట్టాలని ఆదాని లాంటి వాళ్లు కాపుకాసి వున్నారు.. కార్మికులందరు ఐక్యతగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి.. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలని కోరారు.