పుట్టుక విచిత్రం, పునర్జన్మ మరీ విచిత్రం! సురపతి కావడం, చిట్టి ఎలుకను వాహనంగా చేసుకోవడం, మహాభారతం రాయడానికి ఘంటం చేతపట్టడం.. ఇలా ఏకదంతుడి కథలన్నీ ప్రతి ఇంటా మురిసిపోయే పర్వదినమే వినాయక చవితి. తొలిపూజలు అందుకునే ఆ గణనాథుడి నామం పలకగానే భక్తులలో ఏదో తెలియని చైతన్యం, అంతులేని ఆనందం ఆవహిస్తాయి. భాద్రపద శుద్ధ చవితి వేళ మట్టి గణపతినే ఎందుకు పూజించాలి? ఆ ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సృష్టి రహస్యానికి ప్రతీకగా మట్టి పూజ: ముద్గలపురాణంలో కణ్వమహర్షి భరతుడికి గణపతి తత్వాన్ని వివరిస్తూ మట్టి విగ్రహ ప్రాముఖ్యతను వెల్లడించారు. జడపదార్థమైన భూమి , ప్రాణాధార శక్తి అయిన నీరు కలిసినప్పుడే సృష్టి సాగుతుంది. అలాగే పార్వతీదేవి నలుగు పిండితో నమూనా చేసి వినాయకుడికి ప్రాణం పోసింది. అందుకే మట్టి, నీరు కలిపి తయారుచేసిన మృణ్మయ మూర్తిని పూజించడమే నిజమైన శాస్త్ర సమ్మతం.

యోగశాస్త్రం – మూలాధార చక్రం: మన శరీరంలోని షట్చక్రాలలో మొదటిది వెన్నుపూస ప్రారంభంలో ఉండే మూలాధార చక్రం. యోగశాస్త్రం ప్రకారం ఈ చక్రానికి అధిష్ఠాన దేవుడు గణపతి. ఇక మూలాధారం అనేది పృథ్వీ తత్వానికి సంకేతం. కాబట్టి భూమికి సంకేతమైన మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తే ఆ పరమాత్మ అనుగ్రహం, ఆధ్యాత్మిక పురోగతి సత్వరమే లభిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
పంచభూతాల ఆరాధన – నిమజ్జన తత్వం: మట్టి గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఈ మూర్తిని పూజించడం ద్వారా సృష్టికి మూలమైన పంచభూతాలను ఆరాధించినట్లవుతుంది. ఇక ఏ తత్వాలతో రూపుదిద్దుకుందో, చివరకు అందులోనే లయమవడం సృష్టి ధర్మం. అందుకే పూజ తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు, ఆ పంచతత్వాలు తిరిగి ప్రకృతిలోనే లీనమవుతాయి.
ఇక పరమాత్మ ఒక్కడే అనే సత్యానికి, ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి మట్టి గణపతి పూజే అత్యుత్తమ నిదర్శనం. ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు పొందుదాం.
గమనిక: ఇంట్లో లేదా పూజా వేదికల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కెమికల్ రంగులతో చేసిన విగ్రహాలకు బదులుగా సహజ సిద్ధమైన మట్టి విగ్రహాలను వాడటం శాస్త్రరీత్యా శ్రేయస్కరం మరియు పర్యావరణానికి ఎంతో మేలు.
